రూ.6,456 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం | Cabinet approves Rs 6,456 crore for three Railway projects | Sakshi
Sakshi News home page

రూ.6,456 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Aug 29 2024 5:00 AM | Updated on Aug 29 2024 5:00 AM

Cabinet approves Rs 6,456 crore for three Railway projects

న్యూఢిల్లీ: రూ.6,456 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టబోయే మూడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థికవ్యవహారాల కేబినెట్‌ కమిటీ పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. ఒడిశా, జార్ఖండ్, పశి్చమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లోని మరో 300 కి.మీ.ల రైలుమార్గం నిర్మిస్తూ ఆ మార్గంలో కొత్తగా 14 రైల్వేస్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

 ‘ఈ మార్గాల్లో రాకపోకలు పెరగడం వల్ల ఈ 4 రాష్ట్రాల ప్రజలకు మేలు జరగనుంది. ప్రజారవాణాతోపాటు ఇక్కడి ఎరువులు, బొగ్గు, ఇనుము, ఉక్కు, సిమెంట్, సున్నపురాయి తరలింపు సులభం కానుంది. దీంతో 10 కోట్ల లీటర్ల చమురు దిగుమతి భారం, 240 కోట్ల కేజీల కర్భన ఉద్గారాల విడుదల తగ్గడంతోపాటు 9.7 కోట్ల చెట్లునాటినంత ప్రయోజనం దక్కనుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.  

ఈశాన్య రాష్ట్రాలకు రూ.4,136 కోట్ల సాయం 
పలు హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే ఎనిమిదేళ్లలో 15వేల మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి సామర్థ్యం సాధించేందుకు ఆ రాష్ట్రాలకు రూ.4,136 కోట్ల ఈక్విటీ సాయం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. గరిష్టంగా ఒక్కో ప్రాజెక్టుకు రూ.750 కోట్ల మేర రుణసాయం అందించనున్నారు. 

మరోవైపు వ్యవసాయ మౌలికవసతుల నిధి పథకం(ఏఐఎఫ్‌)లో స్వల్ప మా ర్పులు చేస్తూ రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్‌పీఓ)లకూ వర్తింపజేయాలన్న నిర్ణయానికి కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. దీంతో పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, నేతపనివాళ్లు, గ్రామీణ కళాకారులు, హస్తకళాకారులు వంటి వారికీ ఈ పథకం ద్వారా రుణసదుపాయం కలి్పంచేందుకు అవకాశం లభిస్తుంది. రూ. 1 లక్ష కోట్ల మూల నిధితో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం తెల్సిందే.   

ఐదు గంటల సుదీర్ఘ సమీక్ష 
మహిళలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, సామాజిక రంగంలో విధానాల రూపకల్పనకు విస్తృత సంప్రదింపులు జరపాల్సిందిగా ప్రధాని మోదీ మంత్రులను, అధికారులను కోరారు. బుధవారం మొత్తం మంత్రిమండలిలో మోదీ ఐదు గంటల సుదీర్ఘ సమీక్ష జరిపారు. ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా, సమర్థమంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గత పదేళ్లలో ప్రజలకు ఎంతో మేలు చేశామని, అదే వేగంతో వచ్చే ఐదేళ్లు కూడా పనిచేద్దామని మోదీ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement