అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జోర్హాట్ జిల్లాలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
జోర్హాట్ పట్టణంలోని రాజా మైదాన్ ప్రాంతంలో. పాత ఇనుము సామాగ్రిని ఒక వ్యక్తి తన ఇంటివద్ద సుత్తితో కొడుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నూర్ మహమ్మద్ (45), మహమ్మద్ ఇక్బాల్ (8) అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. షెహనాజ్ బేగం (12), నూర్జహాన్ బేగంలకు తీవ్రగాయాలయ్యాయి.
పేలుడు దాటికి పెద్దఎత్తున శబ్ధం రావడంతో స్థానికులు హుటాహుటీన అక్కడ గూమిగూడారు. తొలుత గ్యాస్ సిలిండర్ పేలుడు అని భావించినప్పటికీ తదుపరి విచారణలో అది గ్యాస్ సిలిండర్ పేలుడు కాదని తేలింది. అయితే పేలుడు ఎలా సంభవించిందనే అంశం విచారణ చేపడుతున్నారు. కాగా ఈ ఏడాది అస్సాంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంలో అక్కడ పేలుడు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.


