రెండు జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ గుర్తింపు

Bird Flu Virus Detected In Kerala Alappuzha Kottayam - Sakshi

తిరువనంతపురం : దేశంలో మళ్లీ బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తి మొదలైంది. తాజాగా కేరళలోని కొట్టాయం‌, అలపూజ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ గుర్తించడంతో ప్రభుత్వం అప్రమత్తమైందని అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు, తక్షణ స్పందన కోసం బృందాలను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. కాగా గత వారం కొట్టాయం‌, అలపూజ రెండు జిల్లాలో అనేక బాతులు మరణించాయి. వీటిలో ఎనిమిది బాతుల నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్‌కు పంపించారు. వీటిలోని 5 శాంపిల్స్‌లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ (హెచ్‌5ఎన్‌8) కనుగొన్నట్లు తేలింది. దీంతో ఆ ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న అన్ని పక్షులను వేరే ప్రదేశాలకు మార్చారు.

బర్డ్‌ ఫ్లూ వైరస్‌ కారణంగా ఇప్పటికే 12000 బాతులు మృత్యువాత పడ్డాయి. అలాగే ఈ వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో మరో  36,000 చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ వైరస్‌ మరణాలు సంభవించే ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన సంబంధిత ప్రాంతాల్లో వాటిని గుర్తించేందుకు అధికారులు డ్రైవ్ కూడా ప్రారంభించారు. బ‌ర్డ్ ఫ్లూ మ‌నుషుల‌కు కూడా వ్యాప్తి చెందుతుంది. ఇది కూడా చాలా ప్రాణాంతకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పక్షి మరణాలు సంభవించిన ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు విధించాయి. అంతేకాదు అటువంటి సైట్‌కు కిలోమీటరు దూరంలో ఉంటే పౌల్ట్రీని తొలగించాలని కూడా సూచించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top