యూపీ పల్లెల్లో ‘భేడియా’ టెర్రర్‌! | bhediya attacks villages spreading fear in Bahraich uttar pradesh | Sakshi
Sakshi News home page

యూపీ పల్లెల్లో ‘భేడియా’ టెర్రర్‌!

Aug 29 2024 11:41 AM | Updated on Aug 29 2024 1:36 PM

bhediya attacks villages spreading fear in Bahraich uttar pradesh

లక్నో: ఉత్తరప్రదేశ్‌ బహ్రైచ్ జిల్లా పల్లెలకు కంటి మీద కునుకు కరువైంది. భయం గుప్పిట గడుపుతున్నారు అక్కడి ప్రజలు. తల్లిదండ్రులు.. తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. గత 45 రోజుల్లో తోడేళ్ల గుంపు దాడిలో తొమ్మిది మంది బలయ్యారు. ఇందులో ఎనిమిది మంది చిన్న పిల్లలే కావడం గమనార్హం.

గ్రామస్తుల భయాందోళనలతో.. తోడేళ్ల గుంపును తరిమికొట్టేందుకు జిల్లా అటవీశాఖ రంగంలోకి దిగింది. తోడేళ్లను తరిమికొట్టేందుకు ఏనుగు పేడ, మూత్రాన్ని అటవీ అధికారులు ఉపయోగిస్తున్నారు. సమీప గ్రామాల్లో తాజాగా.. ఇద్దరు చిన్నారులపై తోడేళ్లు దాడి చేశాయి. అప్రమత్తమై తల్లిదండ్రులు వాటి వెంటపడడంతో.. పిల్లలను వదిలేసి అవి పారిపోయాయి. తీవ్రమైన గాయలైన చిన్నారులకు సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

తోడేళ్ల దాడులు పెరిగిపోవడంపై.. స్థానిక ఎమ్మెల్యే  సురేశ్వర్‌ సింగ్‌ రంగంలోకి దిగారు. గ్రామస్తులతో కలిసి రాత్రివేళలో ఆయన కాపల కాస్తున్నారు ‘‘అవి ఒకటో రెండో వచ్చి దాడి చేయడం లేదు. గుంపుగా గ్రామాల మీద పడుతున్నాయి. ఇప్పటికే మూడు తోడేళ్లను జిల్లా అటవీ అధికారులు పట్టుకున్నారు. మొత్తం తోడేళ్లు పట్టుబడే వరకు ప్రజలకు రక్షణగా జాగ్రత్తలు తీసుకోవటంపై అవగాహన కల్పిస్తా. నేను నా కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాం’’ అని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో గ్రామాల్లో ఉన్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న తోడేళ్లను పట్టుకునేందకు సీఎం యోగి ప్రభుత్వం‘‘ఆపరేషన్ భేడియా’’ను కూడా ప్రారంభించింది. తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖ డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ మ్యాపింగ్ పద్ధతులను ఉపయోగిస్తోందని యూపీ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement