బెంగళూరు: కృష్ణరాజపురం పరిధిలో చోటు చేసుకున్న త్రిబుల్ మర్డర్ కేసులో కెన్నెత్ను గురువారం రాత్రి తమిళనాడు, బెంగళూరు పోలీసులు పుదుచ్చేరిలో అరెస్ట్ చేశారు. ప్రియురాలితో కలిసి తల్లిదండ్రులు, చెల్లి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితురాలు శ్వేత పట్టుబడింది. గురువారం నగర 47వ ఏసీజేఎం కోర్టులో శ్వేతను పోలీసులు హాజరుపరిచి మరింత సమాచారం కోసం 7 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. మరోపక్క పరారీలో ఉన్న ప్రియుడు కెన్నెత్ కూడా పోలీసులకు పట్టుబడ్డారు. త్రిబల్ మర్డర్ కేసులో శ్వేత, కెన్నెత్ల అరెస్ట్ కోసం 6 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడంతో తీవ్రంగా గాలించి 23వ తేదీన పుదుచ్చేరి రైల్వేస్టేషన్లో శ్వేతను పోలీసులు అరెస్ట్ చేశారు.
పుదుచ్చేరిలో పట్టివేత
కానీ ప్రియుడు కెన్నెత్ పరారీలో ఉండగా గురువారం రాత్రి పుదుచ్చేరి అణ్ణాసలై ప్రదేశంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఒర్లియన్ పేట పోలీసులు నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. కెన్నెత్ హత్య చేయలేదని శ్వేత తెలిపినప్పటికీ సోమసుందర్ చనిపోయే కొద్ది నిమిషాల ముందు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కేసు కీలక మలుపు తిరిగింది.
కెన్నెత్ తమపై దాడి చేశాడని వాంగ్మూలం ఇచ్చారు. ఇదే ఆధారంగా కెన్నెత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఇది చాలా కీలక కేసు కావడంతో సోషల్ మీడియా లేదా ఎలాంటి మీడియాలో తప్పుడు సమాచారం వైరల్ చేయరాదని దర్యాప్తు అనంతరం ఈ ఘటనకు కారణాలు, పూర్తి సమాచారం మేం తెలియజేస్తామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు.


