చైతన్య భారతి: కందుకూరి వీరేశలింగం / 1848–1919

Azadi Ka Amrit Mahotsav: Kandukuri Veeresalingam Is A Great Reformer - Sakshi

సంస్కరణల దుస్సాహసి

వీరేశలింగం తన ఐదో యేట బడిలో చేరి నేర్చుకున్నవి...  బాల రామాయణం, ఆంధ్రనామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కల్యాణం, సుమతీ శతకం, కృష్ట శతకం. పన్నెండో ఏట నుంచీ  పూర్తిగా ఇంగ్లీషు లోకి వచ్చేశారు. ఇంగ్లిష్‌ పుస్తకాలు, ఇంగ్లిష్‌ భావాలు, ఇంగ్లిష్‌లో సంభాషణలు. సిలబస్‌తో పాటు ఆయన  కేశవ్‌ చంద్రసేన్‌ పుస్తకాలు చదివాడు. బెంగాల్‌ రచయిత కేశవ్‌. స్త్రీని స్థిమితంగా ఉంచలేని సమాజం అది ఎంత  ఆధునికమైనదైనా, నాగరికమైనది కానే కాదని చంద్రసన్‌ రాశాడు. అది పట్టేసింది వీరేశలింగాన్ని. తను అనుకుంటున్నదే ఆయనా రాశాడు! అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్నారు వీరేశలింగం. ఘోరంగా ఉంది. చాలా ఘోరంగా! ఎవరి స్వార్థం వారిదే. ఎవరి నమ్మకాలు వారివే. ప్రజలారా మారండి అని వ్యాసాలు రాశారు. ఉపన్యాసాలు ఇచ్చారు. ఎవరూ మారలేదు.

ఇతడెవరో పిచ్చివాడు అనుకున్నారు. కొత్త పిచ్చోడు అనుకున్నారు. రాజారామ్మోహన్‌ రాయ్‌ననీ, ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ననీ అనుకుంటున్నాడేమో అన్నారు. ఇది బెంగాల్‌ కాదు, ఆంధ్రదేశం తమ్ముడూ అని హితువు చెప్పారు. వీరేశలింగానికీ సమాజానికీ పడడం లేదు. సమాజం అతడికన్నా బలమైనది. అంతకన్నా మొండివారు వీరేశలింగం. ఉపాధ్యాయుడుగా ఆయన శక్తిమంతుడు. ఒక తరాన్ని మలచగలరు పత్రికా సంపాదకుడిగా అతడు శక్తివంతులు. భావ విప్లవం తేగలరు.

కానీ తరాన్ని మలచడానికి, విప్లవం రావడానికి సమయం పడుతుంది. అప్పటివరకు బాల్యవివాహాల బలిపీఠాల నుంచి చిన్నారులను రక్షించేదెలా? బాల వితంతువుల్ని కాపాడేదెలా? సమాజం ఉలిక్కిపడి లేచేలా గట్టి దెబ్బ వేయాలి అనుకున్నారు వీరేశలింగం. వితంతు వివాహాలు జరిపించారు!స్త్రీవిద్య కోసం ఉద్యమించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశారు. ఆయనకు  పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, విద్యార్థుల బలం ఆయనకు తోడయ్యింది. అన్నిటికన్నా పెద్ద బలం ఆయన అర్థాంగి రాజ్యలక్ష్మిగారు. వీళ్లందరి సహకారంతో పంతులుగారు తను నమ్మిన సిద్ధాంతాలని కట్టుబడ్డారు. తను బతికుండగా నలభై వరకూ వితంతు వివాహాలు జరిపించారు. ఈ దుస్సాహమే ఆయన్ని నేడు సంఘసంస్కర్తగా నిలబెట్టింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top