అసోంలో తగ్గని వరద తీవ్రత | Assam flood remains grim with heavy rain resulting in water level rise | Sakshi
Sakshi News home page

అసోంలో తగ్గని వరద తీవ్రత

Jun 6 2025 6:28 AM | Updated on Jun 6 2025 6:28 AM

Assam flood remains grim with heavy rain resulting in water level rise

గువాహటి: అసోంలో వరదల తీవ్రత గురువారం కూడా కొనసాగింది. మొత్తం ఏడు లక్షలమంది వరదలతో ప్రభావితులు కాగా, 21 జిల్లాల పరిధిలోని ప్రధాన నదుల్లో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో మృతుల సంఖ్య 19కి చేరింది. బ్రహ్మపుత్ర సహా మొత్తం తొమ్మిది ప్రధాన నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బరాక్, ఉపనదులు చచార్‌ జిల్లాలో ఉగ్రరూపాన్ని చూపుతున్నాయి. శ్రీభూమి జిల్లాలో అత్యధికంగా 339 గ్రామాల్లోని 2.60 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. 

రాష్ట్రంలో వరదలతో మొత్తం 15 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. కజిరంగా నేషనల్‌ పార్క్‌ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇలా ఉండగా, సిక్కింలోని చటెన్‌లో వరదల్లో చిక్కుకున్న 63 మంది హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులే కావడం గమనార్హం. చెటెన్‌లో చిక్కుకున్న మరో 64 మందిని బయటకు తీసుకువచ్చేందుకు ఆర్మీ, స్థానిక యంత్రాంగం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement