మహా విషాదం.. 265 మంది దుర్మరణం | Air India plane crash: 265 People Dead In Ahmedabad | Sakshi
Sakshi News home page

మహా విషాదం.. 265 మంది దుర్మరణం

Jun 13 2025 2:37 AM | Updated on Jun 13 2025 6:33 AM

Air India plane crash: 265 People Dead In Ahmedabad

ఇలా టేకాఫ్‌ అయి..., కూలిపోతూ..., మంటల్లో...

ఎయిరిండియా విమానానికి ఘోర ప్రమాదం

మెడికల్‌ కాలేజీపై కుప్పకూలి పేలిపోయిన డ్రీమ్‌లైనర్‌

265 మంది దుర్మరణం

అహ్మదాబాద్‌లో ఘోరం

విమానంలోని 242 మందిలో బతికింది ఒక్కరే  

మృతుల్లో గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ సహా 180 మంది భారతీయులే, 53 మంది బ్రిటన్‌వాసులు.. ఏడుగురిది పోర్చుగల్, ఒకరిది కెనడా

టేకాఫైన కొద్ది క్షణాలకే కాలేజీ క్యాంటీన్, హాస్టల్‌పై పడ్డ విమానం 

వాటితో పాటు సమీప భవనాలు ధ్వంసం 

హాస్టల్‌లో ఉన్నవారిలో 24 మంది మృతి

వారిలో ఒక వైద్యుడు, నలుగురు మెడికోలు 

60 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం

శిథిలాల కింద ఇంకా పలువురు ఉండే అవకాశం 

రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖుల దిగ్భ్రాంతి 

ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సంతాపాలు 

ఘటనాస్థలికి మంత్రులు అమిత్‌ షా, రామ్మోహన్‌ 

నేడు ప్రధాని మోదీ సందర్శన

అహ్మదాబాద్‌: మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గురువారం గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. 

కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్‌ కాలేజీ, సిటీ సివిల్‌ హాస్పిటల్‌ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కూడా ఉన్నారు. 

230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్‌వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్‌ విశ్వాస్‌కుమార్‌ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్‌ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది. 

ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్‌ హాస్టల్‌ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్‌ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్‌వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు. 

వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌ పేర్కొంది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. 

ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. ఇద్దరు ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్‌ డాక్టర్‌ మీనాక్షీ పారిఖ్‌ వెల్లడించారు. విమాన శకలాలు, ధ్వంసమై కాలిపోయిన భవనాలు, కార్లు, చెట్లు తదితరాలతో ప్రమాదస్థలి భీతావహంగా మారింది. విమానాశ్రయ, అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సైనిక, స్థానిక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. 

ప్రమాద ధాటికి దాదాపుగా విమానంలోని వారంతా కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యారు. వారిని బయటికి తీసి ఆ ప్రాంగణంలోనే ఉన్న సిటీ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణంపై భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3, ప్రధాని యిర్‌ స్టార్మర్, పలువురు దేశాధినేతలు, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. జరిగింది మాటలకందని దారుణమని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించనున్నారు. 

హాస్టల్‌లోకి  చొచ్చుకెళ్లిన విమానం 

పైలట్‌ ‘మే డే’ అలర్ట్‌ 
విమానం మధ్యాహ్నం 1.39కి టేకాఫ్‌ అయింది. 600 అడుగుల పై చిలుకు ఎత్తుకు వెళ్లిందో లేదో సమస్య తలెత్తింది. దాంతో మరింత పైకి వెళ్లాల్సిన విమానం కాస్తా కిందకు రాసాగింది. అప్పటికింకా కనీసం లాండింగ్‌ గేర్‌ కూడా పూర్తిస్థాయిలో మూసుకోలేదు! దాంతో తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తూ పైలట్‌ వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు ‘మే డే’ కాల్‌ చేశారు. ‘‘ఏటీసీ తక్షణం స్పందించి తిరిగి కాల్‌ చేసినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. 



పైలట్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’’ అని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. చుట్టుపక్కల వాళ్లంతా చూస్తుండగానే క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. ప్రమాదం తాలూకు వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరలైంది. విమానం తాలూకు జంట ఇంజన్లలో టేకాఫ్‌కు అవసరమైన పూర్తిస్థాయి థ్రస్ట్‌ లోపించడమే ప్రమాదానికి కారణమని వైమానిక నిపుణులు భావిస్తున్నారు. 

లేదంటే ఇంజన్లను పక్షులు ఢీకొట్టి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాయంత్రం దాకా నిలిచిపోయాయి. ‘‘విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెడికల్‌ కాలేజీలో డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది నివాస క్వార్టర్లపై కూలిపోయింది. వాటికి మంటలు అంటుకుని లోపలున్న చాలామంది గాయపడ్డారు’’ అని హరేశ్‌ షా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. 

విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్న మహిళలు 

ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం! 
ఎవరినీ కాపాడలేకపోయాం: అమిత్‌ షా 
ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. ‘‘అదంతా ఒక్కసారిగా అంటుకోవడంతో తీవ్రమైన మంటలు చెలరేగి భరించలేనంత వేడి పుట్టుకొచ్చింది. దాంతో ఎవరినీ కాపాడే అవకాశం లేకుండా పోయింది’’ అని చెప్పారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించిన అనంతరం మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. ‘‘డీఎన్‌ఏ శాంపిళ్లను ఇప్పటికే సేకరించారు. గుజరాత్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ వర్సిటీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తాయి’’అని తెలిపారు. 


సెకెనుకు 4 లీటర్ల ఇంధనం 
విమాన ఇంధనాన్ని జెట్‌ ఫ్యూయల్‌ లేదా జెట్‌ ఏ1 అని పిలుస్తారు. బోయింగ్‌ 747 విమానం నడవాలంటే భారీగా ఇంధనం కావాలి. సెకెనుకు 4 లీటర్లు ఖర్చవుతుంది. అంటే నిమిషానికి 240 లీటర్లు, గంటకు 14,400 లీటర్లు కావాలన్నమాట. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు సుమారు 6,859 కి.మీ. దూరానికి 9 గంటలపైనే ప్రయాణం. ఎయిరిండియా విమానంలో అంత భారీగా ఇంధనం ఉండటానికి అదే కారణం. విమానం వేగంగా, బలంగా నేలను తాకగానే అంత ఇంధనం ఒకే మండిపోయింది. దాంతో భారీగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం తేలాల్సి ఉంది. విమానం బ్లాక్‌ బాక్స్‌ కోసం అన్వేషిస్తున్నారు. 

మెడికల్‌ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు 
విమాన కుప్పకూలిన బీజే మెడికల్‌ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. కుప్పకూలిన హాస్టల్‌ భవనాలు తదితరాల కింద చాలామంది వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకుని ఉంటారని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఏఐఎంఏ) తెలిపింది. వారిని వెలికితీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా 265 మృతదేహాలను సిటీ సివిల్‌ ఆస్పత్రికి తరలించినట్టు డీఎస్పీ కనన్‌ దేశాయ్‌ వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని ఎఫ్‌ఏఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ దివ్యాన్‌‡్ష సింగ్‌ అన్నారు. వెలికితీసిన మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయి ఉన్నాయని చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement