● అక్షయ తృతీయ రోజున దుకాణాల్లో కానరాని రద్దీ
నారాయణపేట: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష తదియనే మనం అక్షయ తృతీయగా జరుపుకొంటాం. ఈ శుభ గడియలు ఆదివారం వచ్చి సోమవారం ఉదయం ముగుస్తుండటంతో దాదాపు ఆదివారమే శుభదినంగా భావిస్తున్నారు. శుభకార్యాలు, దానధర్మాలు, పూజా కార్యక్రమాలకు మంచి ముహూర్తంగా పండితులు చెబుతున్నారు. ‘అక్షయ’ అంటే ‘ఎప్పటికీ తరగనిది’ అని అర్థమని.. అందుకే ఈ రోజున బంగారం కొంటే శాశ్వత సంపదను అందిస్తుందని విశ్వసిస్తూ మహిళలు కొంతైనా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. కాగా.. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో మాసం కూడా కొనేందుకు సైతం జనం వెనుకడుగు వేస్తున్నారు.
● జిల్లాకేంద్రంలోని సరాఫ్బజార్లో ఆదివారం సెలవు రోజైనా.. అక్షయ తృతయ కావడంతో పలు బంగారు దుకాణాలు తెరుచుకొని కనిపించాయి. ఏ దుకాణంలో చూసినా జనం లేక వెలవెలబోయాయి. ఇదేమిటని వ్యాపారులను అడుగగా బంగారం ధరలు పెరగడమే కారణమని జవాబిచ్చారు. అక్షయ తృతీయ సెంట్మెంట్ ఉన్నవారు కనీసం మూడు మాసాలు కొనేవారని.. ఇప్పుడు మాసం కూడా కొనేందుకు దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. గతేడాది 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షలోపు ఉంటే.. ఈసారి ఏకంగా రూ.1.56 లక్షలు కావడంతో జనం కొనేందుకు ఉత్సాహం చూపడం లేదని చెబుతున్నారు. 40 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని వ్యాపారులు తెలిపారు.
నిర్మానుష్యంగా కనిపిస్తున్న సరాఫ్బజార్


