
కలిసికట్టుగా.. ప్రగతి బాటలో!
నర్వ: దేశంలో అత్యంత వెనకబడ్డ ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు నీతి అయోగ్ జూలై 4, 2022న సంపూర్ణ అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి దేశంలోని 500 వెనుకబడ్డ ప్రాంతాలను గుర్తించగా ఇందులో రాష్ట్రంలోని 10 జిల్లాలోని అత్యంత వెనకబడ్డ మండలాలను ఎంపిక చేసింది. ఈ మండలాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా దృష్టి పెట్టింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆరోగ్యం, పోషణ, విద్య, పారిశుద్ధ్యం, నీటి వసతి, వ్యవసాయం వంటి ఆరు ముఖ్యమైన సూచికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం, నారాయణపేట జిల్లాలో నర్వ మండలాన్ని ఎంపికచేసి మొదటి మూడు నెలల పాటు చేపట్టిన ఆరు విభాగాల పనితీరును ఇటీవల జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ విడుదల చేశారు. ఇందులో జాతీయ స్థాయిలో దక్షిణ భారత దేశంలో ప్రథమ స్థానం, జాతీయ స్థాయిలో నర్వకు 3వ ర్యాంకు సాధించినట్లు అధికారులు గణంకాలను విడుదల చేశారు.
మెరుగైన పనితీరు..
సంపూర్ణ అభియాన్ ద్వారా ఆరు విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పనుల పనితీరును గత ఏడాది డిసెంబర్ 27న కేంద్రమంత్రి బండి సంజయ్ ఈ ప్రాంతాల్లో పర్యటించి కేంద్రానికి నివేదిక అందించారు. ఇందులో గత 6 నెలలుగా నర్వ మండలంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించి రూ. 4 లక్షలు విడుదల చేయించి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కూర్చునేందుకు ప్రీస్కూల్ బల్లాలు, కుర్చీలు, గోడపై పెయింటింగ్స్, మ్యాంపులు, మంకీ బార్స్, బెడ్షీట్స్ వంటి పరికరాలను మండలంలోని 33 అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. దీంతోపాటు మోడల్ అంగన్వాడీ కేంద్రాలను కొన్నింటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
కేంద్రమంత్రి పర్యటనతో సాకారం..
నీతి అయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికై న 10 జిల్లాల్లో కేంద్రమంత్రి బండి సంజయ్ గత ఏడాది డిసెంబర్లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్వ మండలంలోని రాయికోడ్లో గత ఏడాది డిసెంబర్ 27న పర్యటించి సంపూర్ణ అభియాన్ ద్వారా అమలవుతున్న పథకాలను లబ్ధిదారులు, చిన్నారులను అడిగి తెలుసుకొని కేంద్రానికి నివేదిక అందించారు. దీంతో జాతీయ స్థాయిలో నర్వ మండలానికి అభివృద్ధి పరంగా ప్రత్యేక నిధులు రాబట్టేందుకు ఈ కార్యక్రమం దోహదమవుతుందని అన్నారు.
నర్వ మండలం
రాయికోడ్ మోడల్
అంగన్వాడీ కేంద్రంలో పరిశీలిస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్ (ఫైల్)
ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో జాతీయ స్థాయిలో నర్వకు 3వ ర్యాంకు
జిల్లాలో నీతి అయోగ్ సంపూర్ణ
అభియాన్కు ఎంపిక
మూడు నెలలు.. ఆరు విభాగాల్లో ఉత్తమ ప్రగతి
కేంద్రం నుంచి రూ.2 కోట్ల వరకు సమకూరనున్న నిధులు
ఆరు విభాగాల్లో పనితీరు
మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో ఆరు విభాగాలు న్యుట్రీషణ్(పోషణ), అగ్రికల్చర్( వ్యవసాయం), విద్య (ఎడ్యుకేషన్, నీటి వసతి, సోషల్ సెక్టార్ విభాగాల్లో మెరుగైన పనితీరు కనబర్చారు.
మూడు నెలల్లో 240 మంది గర్భిణులకు ఆరోగ్య, పోషణవంటి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించారు.
మండలంలో 21,405 మందికి బీపీ, షుగర్(మధుమేహం), టీబీ పరీక్షలు నిర్వహించారు.
సంపూర్ణ అభియాన్ ద్వారా తక్షణ అవసరంగా నర్వ పీహెచ్సీకి అంబులెన్స్ను ఏర్పాటు చేశారు.
అగ్రికల్చర్ విభాగంలో రాష్ట్ర వ్యవసాయ కమీషనర్ ఆదేశాల మేరకు 7,145 ఆరోగ్య మట్టి పరీక్షల కార్డులను అందజేశారు. దీంతో పాటు 3200 మట్టి నమూనాలకు సంబందించి త్వరలో కార్డులు అందజేయాల్సి ఉంది.
సోషల్ సెక్టార్ కింద స్వయం సహాయక సంఘాలకు మండల వ్యాప్తంగా రూ.9.40 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలను అందించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం స్వీకరించి మెరుగైన పలితాలను సాధించిన చిన్నారుల తల్లిదండ్రులకు స్వాతంత్య్ర వేడుకలకు ఢిల్లీలో పర్యటించే ఏర్పాట్లు చేపట్టారు.
ఉత్తమ ర్యాంకుతో మరిన్ని నిధులు
సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా ఆరు విభాగాల్లో నర్వ మండలం అత్యుత్తమ ఫలితాలను సాధించి జాతీయ స్థాయిలో ముందంజలో నిలవడం అభినందనీయం. కేంద్రమంత్రి పర్యటన అనంతరం మండలంలో కలెక్టర్ సిక్తాపట్నాయక్ ప్రత్యేక చొరవతో మెరుగైన ఫలితాలను సాధించాం. దక్షిణ భారత దేశంలో ప్రథమ ర్యాంకు, దేశ వ్యాప్తంగా 3వ ర్యాంకులో నిలవడం అభినందనీయం.
– బాలాజీ, నీతి అయోగ్ కోఆర్డినేటర్
జాతీయ స్థాయిలో గుర్తింపు
కలెక్టర్ ఆదేశాల మేరకు నీతి అయోగ్ కార్యక్రమం ద్వారా మండలంలో ఆరు విభాగాల్లో వంద శాతం ప్రగతి సాధించేలా చర్యలు చేపట్టాం. ఇటీవల విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలను నర్వ మండలం సాధించడం సంతోషానిచ్చింది. దేశ వ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వేలో 3వ ర్యాంకు సాధించడంతో మరింత బాధ్యత పెంచింది.
– శ్రీనువాసులు, ఎంపీడీఓ, నర్వ

కలిసికట్టుగా.. ప్రగతి బాటలో!

కలిసికట్టుగా.. ప్రగతి బాటలో!