
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
నారాయణపేట రూరల్: రాష్ట్రంలో పాలకులు మారిన పరిపాలన మాత్రం మారలేదని, గతంలో కేసీఆర్ చేసిన తప్పులను రేవంత్ కొనసాగిస్తున్నాడని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజెపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా కొండ సత్యయాదవ్ బుధవారం పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరగగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల గారడీతో 6 అబద్ధాలు 66 మోసాలతో అధికారంలోకి వచ్చిందని, రైతు రుణమాఫీ, రైతు భరోసా పూర్తిగా లేదని, మహాలక్ష్మి, గృహజ్యోతితో మహిళలను మోసం చేశారని, వృద్ధులకు చేయూత అందించలేదని, సొంతిల్లు కలగానే మిగిలి పోయిందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్డున పడ్డారనీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ దోచుకోవడంలో రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. పదేళ్లు బీఆర్ఎస్ కే.ట్యాక్స్ ఇప్పుడు కాంగ్రెస్ ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని పాతర వేశారని ప్రజలు వీరి పాలనలో భూమి, ఇళ్లు కోల్పోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో చేపట్టిన సంక్షేమ పథకాలను, వక్ఫ్ బోర్డు రద్దుతో ముస్లింలకు నష్టం లేదన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని బీజేపీ గెలుపునకు పట్టుదలతో కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.
నిరంకుశ పాలన తలపిస్తున్న సర్కారు..
కేసీఆర్ హిట్లర్ మాదిరి వ్యవహరిస్తూ పరిపాలిస్తున్నాడని ప్రజలు భావించి ఆయనను గద్దె దింపితే.. రేవంత్రెడ్డి సైతం అదే తీరులో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 12 యూనివర్సిటీలకు సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు జీవో 21ని రద్దు చేయాలని ప్రజాస్వామ్య భద్రంగా నిరసన వ్యక్తం చేస్తుండగా దౌర్జన్యంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. హెచ్సీయూ భూములను అమ్మడంపై బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందనిన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈక్రమంలోనే చంద్రఘడ్ కు చెందిన గర్భిణి బిడ్డను కోల్పోయిందని వాపోయారు. ఇంత దారుణమైన సంఘటన జరిగిన ప్రభుత్వానికి చలనం లేదన్నారు. వెంటనే సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సవతి తల్లి ప్రేమ విడనాడాలి
కొడంగల్, నారాయణపేటను సమాంతరంగా అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించి సవతితల్లి ప్రేమ చూయిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండ సత్తియాదవ్ విమర్శించారు. రాబోవు ఎన్నికల్లో కమల వికాసమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. నాగురావు నామాజీ, రతన్ పాండు రెడ్డి, శ్రీనివాసులు, కొండయ్య, పూనమ్ చాంద్ లాహోటి, రఘువీర్ యాదవ్, రఘురామయ్య గౌడ్, జ్యోతి సాయిబన్న పాల్గొన్నారు.
బీఆర్ఎస్ చేసిన తప్పిదాలే కాంగ్రెస్ చేస్తుంది..
మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ