
ముదిరాజ్లను బీసీ–ఏలో చేర్చడమే లక్ష్యం
మరికల్: అన్నిరంగాల్లో వెనకబడిన ముదిరాజ్లను బీసీ–ఏలో చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాశ్ అన్నారు. మంగళవారం మరికల్కు వచ్చిన ఆయనకు మండల ముదిరాజ్ సంఘం నాయకులు ఘనస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్ విలేకర్లతో మాట్లాడుతూ.. బీసీ–ఏలోకి ముదిరాజ్లను చేర్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఇందుకు ముదిరాజ్ జాతి చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముదిరాజ్లను బీసీ–ఏలో చేర్చేందుకు బిల్లు పెట్టగా.. అప్పట్లో కొన్ని దుష్టశక్తులు అడ్డు పడటంతో ఆగిపోయిందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ముదిరాజ్లను బీసీ–ఏలోకి చేర్చేందుకు ప్రభుత్వానికి నెలరోజుల సమయం ఇస్తామన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్, నారాయణ, పటేల్ శ్రీను, కృష్ణయ్య, రాములు, టంకర శ్రీను, కుర్మన్న, కొండప్ప, నర్సింహులు, సతీష్, సాయితేజ ఉన్నారు.