బత్తలపల్లిలో విషాదం | - | Sakshi
Sakshi News home page

బత్తలపల్లిలో విషాదం

Aug 26 2026 1:30 AM | Updated on Aug 26 2026 1:30 AM

నేను వస్తానంటే వద్దు అన్నారు..

శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి వాసులు శ్రీశైలంలో ఆత్మహత్య చేసుకోవడంతో వారి సొంతూరులో విషాదం అలుముకుంది. సుధాకర్‌కు ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు ఉన్నారు. పెద్ద అక్క ఆదిలక్ష్మిని తాడిమర్రి మండలం ఏకపాదంపల్లికి చెందిన రాముడుకు ఇచ్చి వివాహం చేశారు. రెండో అక్క మల్లీశ్వరిని ముదిగుబ్బ మండలం ఉప్పలపాడుకు చెందిన వేమయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. సుధాకర్‌కు ఉన్న రెండు ఐచర్‌ వాహనాలు సక్రమంగా నడవక పోవడంతో వాటిని తీసేశాడు. ఆ తర్వాత పది ఆటోలు అద్దెకు ఇచ్చి నడిపేవాడు. బత్తలపల్లిలో ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌గానూ ఎన్నికయ్యాడు. ఈ క్రమంలో చాలా మంది తెలిసిన వారు, బంధువులు, బ్యాంకుల్లోనూ రుణం తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పు చేసి ఉండొచ్చని బంధువులు, స్థానికులు చెబుతున్నారు. అప్పు ఇచ్చిన వారికి కూడా ఐపీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఆటోలు కూడా ఫైనాన్స్‌ కంపెనీలు స్వాధీనం చేసుకున్నాయి. దీనికితోడు భారంగా నడుస్తున్న కుటుంబంలోకి భర్తలను వదిలేసి ఇద్దరు అక్కలు వచ్చి చేరారు. వారిలో ఒకరికి పక్షవాతం. మల్లేశ్వరి కుమారుడు మణికంఠ మానసిక స్థితి సరిగా లేకపోవడం సమస్యలు వేధించాయి. దీంతో ఈ కుటుంబాన్ని పోషించే భారం సుధాకర్‌ పై పడింది. దీంతో మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణమై ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. వారు కాల నీలో ఎవరితోనూ సరిగా మాట్లాడేవారు కాదని, ప్రవర్తనలోనూ మార్పు ఉండేదని చెప్పుకుంటున్నారు. అందరూ బంధువులైనా ఎవరితోనూ సరిగా కలివిడిగా ఉండేవారు కాదని అంటున్నారు.

శ్రీశైలానికి తరలివెళ్లిన బంధువులు..

ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం అందగానే సుధాకర్‌ రక్త సంబంధీకులు, కాలనీవాసులు శ్రీశైలానికి బయల్దేరివెళ్లారు. ఆర్థిక కష్టాలతో అవస్థలు పడిన నేపథ్యంలో వారి మృతదేహాలను బత్తలపల్లికి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయగా, మృతదేహాలు దుర్వాసన వస్తుండడంతో అక్కడే ఖననం చేసినట్లు తెలిపారు. వారు శ్రీశైలం వెళ్లేందుకు గాను స్థానికులు కొందరు ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిసింది. దీంతో బస్సు తీసుకొని శ్రీశైలానికి వెళ్లారు.

నేను అప్పుడప్పుడు వారితో మాట్లాడుతుంటా. మా చిన్న మరదలు శ్రీదేవికి బాగాలేకపోతే తిరుపతి వద్దనున్న విరూపాక్షపురానికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత వారంతా శ్రీశైలానికి వెళ్లినట్లు చెప్పారు. నేను వస్తా అంటే సుధాకరే వద్దన్నాడు. నాలుగు రోజుల క్రితం ఫోన్‌ చేస్తే భార్య మాట్లాడింది. అప్పులేమో చాలా చేశారు. ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా బాగానే మాట్లాడింది. నేను రావాలా అంటే.. వద్దు లే.. నీకు ముందే బీపీ, షుగర్‌ ఉన్నాయి. మాకే బరువు అవుతుంది. నీవు పడిపోతే నీకు ఎవరు చేసేది అంది. తినడానికి ఖర్చులకు వెంపర్లాడుతు న్నామని చెప్పింది. అక్కడికి వరకూ వెళ్లి చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందో.. దేవుడేకి తెలియాలి.

– గోగుల రాముడు, ఆదిలక్ష్మీ భర్త, బత్తలపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement