నంద్యాల(అర్బన్): కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్ట్లో అలసత్వం ప్రదర్శించవద్దని, ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ సునీల్షెరాన్ అన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం డోన్ సబ్ డివిజన్కు సంబంధించిన నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ల పెండింగ్ కేసులు, వాటి స్థితి గతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్ట్, కేసుల పురోగతిపై సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. డోన్ సబ్ డివిజన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలు, చిన్న పిల్లల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూ అఘాయిత్యాలు, వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దన్నారు.


