
మనసారా దీవిద్దామంటే..
దొర్నిపాడు: పదో తరగతి ఫలితాల్లో 557 మార్కులు వచ్చిన కుమార్తెను మనసారా దీవిద్దామంటే తమ వద్ద లేకుండా మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన దేవరాజ్ పాస్టర్గా పనిచేస్తున్నారు. ఈయన కుమార్తె సారా దొర్నిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో చదివి పదో తరగతి చదివి పరీక్షలు కూడా రాశారు. తీవ్ర జ్వరం రావడం, కడుపునొప్పి ఉండటంతో ఆపస్మారక స్థితిలోకి చేరి ఈనెల 19వ తేదీ ఆళ్లగడ్డ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. పదో తరగతి ఫలితాలు బుధవారం రాగా సారాకు 557 మార్కులు వచ్చాయి. మంచి మార్కులు వచ్చినా కుమార్తె తమ వద్ద లేదని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపుతున్న సారా ఫలితాలను చూసుకోలేక పోయిందని హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
పేదింటి బిడ్డకు సరస్వతీ కటాక్షం
కోవెలకుంట్ల: పేదింటి బిడ్డకు సరస్వతీ కటాక్షం వరించింది. పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించారు. దొర్నిపాడు మండలం క్రిష్టిపాడుకు చెందిన సుబ్బరత్నం, సరస్వతీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె హరిత కోవెలకుంట్ల పట్టణంలోని సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం పదో తరగతి చదివారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఈ విద్యార్థినికి 591 మార్కులు వచ్చాయి. ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసి పేద ప్రజలకు సాయం చేయాలన్నదే తన లక్ష్యమని హరిత తెలిపారు.

మనసారా దీవిద్దామంటే..