టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Apr 16 2025 12:38 AM | Updated on Apr 16 2025 12:38 AM

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

● సొంత పార్టీ నాయకులే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ● నందివర్గం పోలీసులు కొట్టడంతో మనస్తాపం

కొలిమిగుండ్ల: బెలుం శింగవరానికి చెందిన టీడీపీ కార్యకర్త వరదరాముడు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం బనగానపల్లె మండలం నందవరంలో విందు ఉండటంతో అక్కడికి వెళ్లాడు. అక్కడే బెలుం శింగవరంకు చెందిన టీడీపీ నాయకులతో వాగ్వావాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై వాళ్లు నందివర్గం పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం పోలీసులు స్టేషన్‌కు పిలిపించి వరదరాముడిని కొట్టడంతో కాళ్లకు గాయాలయ్యాయి. తర్వాత వారం రోజుల పాటు ఊర్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు. అప్పటి నుంచి నంద్యాల సమీపంలోని అత్తగారింట్లో ఉంటున్నాడు. అంతటితో ఆగకుండా టీడీపీ నాయకులు మళ్లీ కొలిమిగుండ్ల పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేశారు. నందివర్గం తరహాలో ఇక్కడ పోలీసులు తమను కొడతారనే భయాందోళన చెందాడు. మంగళవారం అత్తగారి ఊరు నుంచి వస్తూ మార్గమధ్యలో సంజామల మండలం ఆకుమల్లలో క్రిమిసంహారక మందు కొనుగోలు చేసి బెలుం శింగవరానికి చేరుకున్నాడు. సొంత పొలంలోకి వెళ్లి ఫేస్‌బుక్‌ లైవ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి మందు తాగి చెట్టు కింద పడిపోయాడు. లైవ్‌లో చూసిన గ్రామస్తులు కొలిమిగుండ్ల సీఐ రమేష్‌బాబుకు సమాచారం ఇచ్చారు. బాధితుడి సెల్‌ ఫోన్‌ ఆధారంగా సాంకేతిక సాయంతో లోకేషన్‌ గుర్తించి సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికి అపస్మారక స్థితిలో ఉండగా చికిత్స కోసం అవుకు సీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు కర్నూలుకు తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శంకరరెడ్డి, రామ్మోహన్‌, వెంకటసుబ్బయ్య వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించానని బాధితుడు ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామని సీఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement