రామగిరి(నల్లగొండ ): ఆర్టీసీ సంస్థ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం నల్లగొండలోని రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్ఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ 2013 ీపీఆర్సీ ప్రకారం యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్ కంట్రిబ్యూషన్ను వెంటనే పీఎఫ్ కమిషనర్ ఆఫీసుకు పంపించాలన్నారు. 2017 పీఆర్సీ బకాయిలను 9 సంవత్సరాలుగా చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2021 పీఆర్సీని అమలు పరిచి బకాయిలను కూడా తక్షణమే విడుదల చేయాలన్నారు. సూపర్ లగ్జరీ సర్వీసుల్లో కుటుంబ సభ్యులకు ఉచిత ప్రయాణం కల్పించాలని, తార్నాక ఆస్పత్రిలో పాత పద్ధతిలోనే ఒకేసారి రెండు నెలలకు సరిపడా మెడిసిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ భోనగిరి శంకరయ్య, రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు కత్తుల యాదగిరి, పల్రెడ్డి యాదగిరిరెడ్డి, బొమ్మ మల్లయ్య, శ్రీను, విఎస్పి.రావు, వివి.రెడ్డి, విఎ.రెడ్డి, రవీందర్, ఎస్ఆర్రెడ్డి, ఎండీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు.


