యాదగిరిగుట్ట : కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చి వెళ్తుండగా టాటా ఏస్ వాహనం బోల్తా పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన తప్పాటి నరసింహ (30) జీహెచ్ఎంసీకి చెందిన టాటా ఏస్ వాహనంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. కొండకు దిగువన పార్కింగ్ ఏరియాలో టాటా ఏస్ వాహనాన్ని పార్కింగ్ చేసి కొండపైకి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి కిందకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో భాగంగా యాదగిరిగుట్ట రింగ్ రోడ్డులోకి రాగానే టాటా ఏస్ వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నరసింహ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న పెంటి కృష్ణమూర్తి, హరికంటి ధనుష్, రామాంజనేయులు, హరికంటి దర్శిత, పెంటి మధుకృష్ణ, హరికంటి రామాంజనేయులు, డ్రైవర్తో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నరసింహ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ఈ ప్రమాదం జరిగిందని యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి సమయానికి రాకపోవడంతోనే నరసింహ మృతిచెందినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.
ఫ టాటా ఏస్ వాహనం బోల్తా పడి
యువకుడు మృతి
ఫ మరికొందరికి గాయాలు


