బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలి
చిట్యాల : ప్రజలకు మంచి పరిపాలన కావాలంటే చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటర్లు మద్దతు ఇవ్వాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో రుద్రవరం యాదయ్య, రెండో వార్డు అభ్యర్థి షబనా అజీమ్, తొమ్మిదో వార్డు అభ్యర్థి ఆగు అశోక్ తరఫున సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ నిస్వార్థంగా పనిచేసేవారిని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులుగా ఎంపిక చేసి ఎన్నికల్లో పోటీలో నిలిపామన్నారు. రాబోయే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు నిలిచిపోయిన సంక్షేమ పథకాలు, అసంపూర్తి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. రెండున్నరేళ్లుగా చిట్యాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా మోసపూరిత హామీలతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో దూదిమెట్ల సత్తయ్య, అర్రూరి శ్రీశైలం, కన్నెబోయిన శ్రీశైలం, చిత్రగంటి ప్రవీణ్, రుద్రవరం సునీల్, నర్రా భిక్షంరెడ్డి పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


