జీవామృతంతో చీడపీడల నివారణ
నడిగూడెం : ఘన, ద్రవ జీవామృతంతోపాటు వేస్ట్ డీకంపోజర్, వర్మి కంపోస్టు వాడడం ద్వారా పంటలకు సోకే చీడపీడలను నివారించవచ్చని గడ్డిపల్లి కేవీకే ఇన్చార్జి డి.నరేష్, మృత్తికా విభాగం శాస్త్రవేత్త ఏ.కిరణ్ సూచించారు. గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు క్రింద కృషి, సఖీ బృందాల సభ్యులకు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ శిక్షణలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన వాసికర్ల శేషు కుమార్ సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. 1.50 ఎకరాల విస్తీర్ణంలో సహజసిద్ధ పద్ధతుల్లో చేస్తున్న సమగ్ర ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతు వివరించారు. అనంతరం శాస్త్రవేత్తలు పలు అంశాలపై సభ్యులకు ప్రయోగపూర్వకంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆత్మా డీపీడీ జి.నివేదిత, కె.మల్లారెడ్డి, బి.భువనేశ్వరి పాల్గొన్నారు.


