కనుల పండువగా రథోత్సవం
యాదగిరిగుట్ట : పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం స్వామి వారు గరుడ వాహనంపై ఊరేగగా.. రాత్రి దివ్య విమాన రథంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. ఆలయంలో నిత్యారాధనల అనంతరం చతుర్వేద పారాయణములు, నిత్య హవనం, మూలమంత్ర, మూర్తి మంత్ర జపములు, లక్ష్మీ అష్టోత్తర నామ జపములు జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై తిరు వీఽధిలో ఊరేగించారు. సాయంత్రం రధాంగహోమం, రథబలి వేడుకలను నిర్వహించారు. అనంతరం రథంపై స్వామి, అమ్మవార్లను అధిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా వేడుకల్లో ఆలయాధికారులు, అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. రథోత్సవంలో యువత, భక్తులు అధికంగా పాల్గొన్నారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు.
నేడు ప్రత్యేక పూజలు..
సోమవారం ఉదయం 9గంటలకు ఆలయంలో పూర్ణాహుతి, మధ్యాహ్నం 12గంటలకు చక్రతీర్థం, సాయంత్రం 5గంటలకు దేవతోద్వాసన, పుష్పయాగం వంటి పూజలు నిర్వహిస్తారు.
గరుడ వాహనంపై ఊరేగిన పూర్వగిరీశుడు
నేడు చక్రతీర్థం
కనుల పండువగా రథోత్సవం


