సాంకేతిక లోపంతో నిలిచిన గూడ్స్ రైలు
● కోదాడ – జడ్చర్ల హైవేపై ట్రాఫిక్ జామ్
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని ఎఫ్సీఐ గోదాంలోకి వెళ్లే గూడ్స్ రైలు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆదివారం ఉదయం కోదాడ–జడ్చర్ల హైవేపై అడ్డంగా నిలిచిపోయింది. దాంతో రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్మేర వాహనాలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు మరో స్టేషన్ నుంచి రైల్ ఇంజన్ రప్పించి రైలును అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం స్థానిక పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
మహిళ మెడలో
పుస్తెలతాడు చోరీ
నడిగూడెం : మహిళ మెడలో బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన సంఘటన ఆదివారం నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురంలో చోటుచేసుకుంది. ఎస్ఐ గందమళ్ల అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారి కూలి పనులు చేసుకునే జంగిలి వీరమ్మ మధ్యాహ్నం సమయంలో గ్రామ శివారులోని గంగమ్మ గుడికి వెళ్తోంది. ఈక్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఆమె మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోతుండగా ఆమె ప్రతిఘటించి తాడును గట్టిగా పట్టుకోవడంతో సుమారు 20 గ్రాముల తాడు వరకు తెగి పడింది. దీంతో దానిని తీసుకొని పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


