ప్రపంచంలో ఉత్తమ భాష తెలుగు
రామగిరి(నల్లగొండ) : ప్రపంచంలో తెలుగు భాష ఉత్తమమైనదని ఆంధ్రప్రదేశ్లోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ మాడభూషి సంపత్కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, తెలంగాణ తెలుగు భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో ‘తెలుగు భాషా వికాసంలో వివిధ వైఖరులు’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. మాతృభాషతో నైతిక విలువలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పొందవచ్చన్నారు. తెలుగు మీడియంలో చదువుకున్న వారికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వాలు తెలుగు భాష పరిరక్షణకు పూనుకోవాలని కోరారు. తెలంగాణ చరిత్రకారుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భాష చాలా విశిష్టమైందని, కేవలం ప్రామాణిక భాష రక్షణ వల్ల తెలుగు భాష బతకదని, తెలంగాణ పదజాలాన్ని రక్షిస్తేనే తెలుగుకు ఉనికి ఉంటుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.కాశీం మాట్లాడుతూ భాష భావజాలానికి ఒక వాహిక అన్నారు. తెలంగాణలో మాట్లాడే భాష పుస్తక భాషగా మారాలని అన్నారు. మాట్లాడడం, రాయడం వంటి నైపుణ్యాలు ఉంటే యువతకు ఉపాది అవకాశాలు వస్తాయన్నారు. ఆచార్య రెడ్డి శ్యామల మాట్లాడుతూ మారుతున్న భాషను అందిపుచ్చుకోవాలన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ పి.విజయకుమార్ మాట్లాడుతూ తెలుగు భాష మధురమైందని.. దానిని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ కె.లావణ్య, కేంద్రియ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, ఎంజీయూ తెలుగు పాఠ్య ప్రణాళిక అధ్యక్షులు బెల్లి యాదయ్య, కవి విమర్శకులు పగడాల నాగేందర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు సంగి రమేష్, ఎస్.రఘు, తండు కృష్ణకౌండిన్య, దీపిక, మామిడాల రమేష్బాబు, బకరం నర్సింహ, ఎం.ఆనంద్, నర్రా లవేందర్రెడ్డి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, వెల్దండి శ్రీధర్, రవికుమార్, అంతటి శ్రీనివాస్, ముని స్వామి, బత్తిని నాగరాజు, అనిల్ బొజ్జ, మల్లేశం, అనిల్ అబ్రహం, జ్యోత్స్న పాల్గొన్నారు.
సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కాశీం, ప్రొఫెసర్ మాడభూషి సంపత్కుమార్
ప్రపంచంలో ఉత్తమ భాష తెలుగు


