ఇక్కడా వెలుగులోకి..
రూ.4 లక్షలు కొల్లగొట్టారు
● చండూరు మండలం ఇడికూడ రెవెన్యూ పరిధిలోని తాస్కానిగూడెం గ్రామానికి చెందిన వంగూరి శ్రీనివాస్ తన 39 గుంటల భూమిని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి గ్రామానికి చెందిన గంజి పాండుకు రిజిస్ట్రేషన్ చేశాడు. అందుకోసం చౌటుప్పల్లోని తరుణ్ డాక్యుమెంట్ రైటింగ్ సెంటర్లోనే స్టాట్ను బుక్ చేశారు. అందుకు రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.18,300 తీసుకున్నా..
ఎడిట్ ఆప్షన్తో రూ.572లే చెల్లించాడు.
● గట్టుప్పల్ మండలం తేరట్పల్లికి చెందిన కానుగుల వెంకటయ్య తన 1.20 ఎకరాల భూమిని ముగ్గురు కొడుకుల పేరున పట్టా చేయించేందుకు చౌటుప్పల్లోని బాతరాజు తరుణ్కు చెందిన డాక్యుమెంట్ రైటింగ్ సెంటర్లో స్లాట్ బుక్ చేసుకున్నాడు. ఇందుకు ప్రతి డాక్యుమెంట్కు రూ.8500 చొప్పున రూ.25,500, బుకింగ్ చార్జీల కింద రూ.2 వేలు మొత్తం రూ.27,500 తరుణ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు. కానీ తరుణ్ ఒక్కో డాక్యుమెంట్కు రూ.8,500 చొప్పున కాకుండా ఎడిట్ ఆప్షన్తో రూ.500 చొప్పునే చెల్లించి రూ.24 వేలు తనే మింగేశాడు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :
భూభారతి పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఆధారంగా చోటుచేసుకున్న భారీ కుంభకోణం నల్లగొండ జిల్లాలో కూడా వెలుగుచూసింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి అందాల్సి సొమ్ము రూ.కోట్లు స్వాహా చేశారు. యాదాద్రి, జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున బయటపడిన ఈ బాగోతం నల్లగొండ జిల్లాలోనూ వెలుగుచూసింది. జిల్లాలోని చిట్యాల, గట్టుప్పల్, చండూరు, మర్రిగూడ, నాంపల్లి తదితర మండలాల్లోనూ స్లాట్ బుకింగ్లో అక్రమాలు జరిగినట్లు తేలింది.
చౌటుప్పల్లోనే స్లాట్ల బుకింగ్
భూభారతి పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఆధారంగా చోటుచేసుకున్న భారీ కుంభకోణంలో చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ షాపు నిర్వహిస్తున్న తాళ్ల సింగారం గ్రామానికి చెందిన బాతరాజు తరుణ్ కీలకపాత్ర పోషించాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులోని ప్రధాన నిందితుడైన యాదగిరిగుట్టకు చెందిన బసవరాజుతో నేరుగా సంబంధాలు పెట్టుకొని ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. చౌటుప్పల్కు చెందిన తొర్పునూరి లింగస్వామి కూడా ఇందులో కీలక పాత్రధారిగా ఉన్నాడు. తరుణ్ తన వద్దకు వచ్చే రైతుల భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్ డబ్బులను చలానా రూపంలో నేరుగా ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి ఉన్నా.. ఎడిట్ ఆప్షన్ను ఆసరాగా చేసుకొని డబ్బులను దారి మళ్లించారు. వీరు వివిధ జిల్లాల్లోని డాక్యుమెంట్ రైటర్లతోనూ చేతులు కలిపారు. అక్కడి భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్లు ఇక్కడి నుంచే చేశారు. రైతుల వద్ద నిర్దేశించిన ప్రకారంగా డబ్బులు తీసుకున్నప్పటికీ ప్రభుత్వ ఖాతాకు పూర్తిగా జమ చేయకుండా కాజేసి పంచుకున్నారు. ఇలా 2024 నుంచి ఇప్పటి వరకు 237 డాక్యుమెంట్లకు సంబంధించిన రూ.1.17 కోట్లు కొల్లగొట్టారు. నిందితులు బాతరాజు తరుణ్, పాలమాకుల హరీష్, తూర్పునూరి లింగస్వామిపై కేసు నమోదు చేసిన పోలీసులు నల్లగొండ జైలుకు తరలించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ చంద్రశేఖర్
ఫ నల్లగొండ జిల్లాలో 11 డాక్యుమెంట్లకు చెందిన రూ.4 లక్షలు పక్కదారి
ఫ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కేంద్రంగా
భూ రిజిస్ట్రేషన్లలో అక్రమాలు
ఫ సీసీఎల్ఏకు అందిన నివేదిక
ఫ ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలపై అధికారుల దృష్టి
యాదగిరిగుట్ట కేంద్రంగా స్లాట్ బుకింగ్లో అక్రమాలు బయటకు రావడంతో జిల్లాలోనూ ఇలాంటి సంఘటనలు ఉన్నాయా? అనే అంశంపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.శ్రీనివాస్ దృష్టి సారించారు. తహసీల్దార్లతో విచారణ చేయించారు. చిట్యాలలో ఆరు, గట్టుప్పల్లో మూడు, నాంపల్లిలో ఒకటి, చండూరులో ఒకటి చొప్పున జరిగిన రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగనట్లు గుర్తించారు. మొత్తంగా 11 రిజిస్ట్రేషన్లలో దాదాపు రూ. 4 లక్షల మేర కొల్లగొట్టినట్లు తేల్చారు. వాటిపై నివేదికలను రూపొందించి సీసీఎల్ఏకు పంపించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని నార్కట్పల్లి, నిడమనూరు, గుర్రంపోడు తదితర మండలాల్లోనూ వారు స్లాట్ బుకింగ్లో డబ్బు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిపైనా అధికారులు పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది.
ఇక్కడా వెలుగులోకి..


