‘ఫార్మర్ రిజిస్ట్రీ’పై అనాసక్తి
పట్టాదార్ పాస్పుస్తకం కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు ఫార్మర్ యూనిక్ ఐడీ కార్డు తప్పనిసరి. రైతులు ఏఈఓల వద్ద కాని తమ సమీప మీ సేవ కేంద్రాల్లో గాని విధిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
– పాల్వాయి శ్రవణ్కుమార్,
జిల్లా వ్యవసాయాధికారి
నల్లగొండ అగ్రికల్చర్: వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది మే 6వ తేదీన చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 5,65,782 మంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉండగా.. ఇప్పటివరకు 2,32,755 మంది రైతులే ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఈ ప్రక్రియ ప్రారంభమై 8 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు 52.72 శాతం పట్టాదార్ పాస్బుక్లు కలిగిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. ఇంకా సగం మంది నమోదు చేసుకోలేదు. అదేవిధంగా అందులో జిల్లా వ్యాప్తంగా 2,81,413 మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అర్హులుగా ఉండగా.. కేవలం 1,26,072 మంది రైతులు (44.8 శాతం) రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు.
కేంద్ర పథకాలకు యూనిక్ నంబర్ తప్పనిసరి
ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక విశిష్ట సంఖ్య కేటాయించి గుర్తింపు కార్డు ఇవ్వనుంది. ఇందులో 11 అంకెల యూనిక్ ఐడీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్కార్డులు, ఫసల్ బీమా తదితర పథకాలు వర్తించాలంటే రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. భవిష్యత్లో ఎరువుల పంపిణీ కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఉండనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. గత నెల వరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ను వ్యవసాయ విస్తరణ అధికారులే తమ మొబైల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం మీ సేవ కేంద్రాల్లో కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు కల్పించింది.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇలా..
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏఈఓల ద్వారాగాని, మీ సేవ కేంద్రాల్లో గాని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇందు కోసం ఆధార్కార్డుతో పాటు ఆధార్కు లింక్ అయిన మొబైల్ను తీసుకెళ్లాలి. ఫోన్కు 3 సార్లు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. 11 అంకెలతో కూడిన యూనిక్ ఐడీ వస్తుంది.
ఫ జిల్లావ్యాప్తంగా
5,65,782 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు
ఫ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది 2,32,755 మంది రైతులే
‘ఫార్మర్ రిజిస్ట్రీ’పై అనాసక్తి


