సోలార్ వినియోగదారులకు షాక్!
కోదాడ : సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి ఓ వైపు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుండగా.. మరోవైపు వినియోగదారుడిపై అధిక భారం మోపుతూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) గుట్టుచప్పుడు కాకుండా సోలార్ బిల్లంగ్లో మార్పులు చేసింది. పథకం ప్రారంభంలో ఉన్న నెట్ మీటరింగ్కు బదులు నెట్ బిల్లింగ్ను అమలు చేస్తోంది. దీని లోగుట్టు అర్ధంకాక వినియోగదారుడు భారీగా నష్టపోతున్నాడు. సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు ఇదేమిటని ప్రశ్నిస్తే అదంతా మాకు తెలియదు.. రాష్ట్ర వ్యాప్తంగా పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే బిల్లింగ్ విధానంలో మార్పు వచ్చిందని స్థానిక విద్యుత్శాఖ అధికారులు చెబుతున్నారు.
అసలు విషయం ఏమిటంటే..
ఇంటి అవసరాలకు అవసరమయ్యే విద్యుత్ను సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ అనే పథకాన్ని గత సంవత్సరం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే అయ్యే ఖర్చు సుమారు రూ.2లక్షల్లో సబ్సిడీ కింద రూ.78వేలు కేంద్ర ప్రభుత్వం వినియోగదారుడి అకౌంట్లో వేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వమే బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు ఇచ్చే ఏర్పాటు చేసింది. దీంతో పలువురు ఈ పథకం ద్వారా తమ ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో నెట్ మీటరింగ్ విధానం అమలు చేసేవారు గత అక్టోబర్ నుంచి దీన్ని నెట్ బిల్లింగ్గా మార్చారు. సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్టాప్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారుడు వాటి ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ను విద్యుత్ సంస్థకు సరఫరా చేస్తాడు. దీన్ని ఎక్స్పోర్ట్ విద్యుత్ అంటారు. అదే సమయంలో వినియోగదారుడు విద్యుత్ సంస్థ నుంచి తన ఇంటి అవసరాలకు వాడుకుంటాడు. దీన్ని ఇంపోర్ట్ విద్యుత్ అంటారు. గతంలో వినియోగదారుడు వాడుకున్న విద్యుత్కు తన సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్లో నుంచి తీసేసి మిగిలిన యూనిట్లకు బిల్లు వసూలు చేసేవారు. ఉదాహరణకు వినియోగదారుడు ఒక నెల 300 యూనిట్ల విద్యుత్ వాడుకుంటే.. అతడు తన సోలార్ ప్యానల్స్ ద్వారా 200 యూనిట్లు ఉత్పత్తి చేశాడనుకుంటే దాన్ని అతను వాడుకున్న 300 యూనిట్ల నుంచి తీసివేసి మిగిలిన 100 యూనిట్లకు బిల్లు వసూలు చేసేవారు. దీన్నే నెట్ మీటరింగ్ అంటారు.
అమ్మబొతే అడవి.. కొనబోతే కొరివి
విద్యుత్ సంస్థ వినియోగదారుడికి 200 యూనిట్ల వరకు యూనిట్ రూ.5 చొప్పున, 200 నుంచి 300 యూనిట్ల వరకు రూ.6, 300 యూనిట్లు దాటితే సుమారు రూ.7 వరకు వసూలు చేస్తుంది. ఒక వినియోగదారుడు 300 యూనిట్లు వాడుకుంటే దానికి విద్యుత్ సంస్థ రూ.7 చొప్పున రూ.2100 వసూలు చేస్తుంది. సోలార్ ప్యానల్స్ ద్వారా వినియోగదారుడు 200 యూనిట్లు ఉత్పత్తి చేస్తే దానికి యూనిట్కు రూ.5.25 చొప్పున రూ.1050 మాత్రమే ఇస్తుంది. అంటే తన విద్యుత్ను యూనిట్కు రూ.7 అమ్ముతున్న సంస్థ వినియోగదారుడి విద్యుత్కు మాత్రం యూనిట్కు రూ.5.25 మాత్రమే ఇస్తుంది. దీన్నె నెట్ బిల్లింగ్ అంటారు. నెట్ మీటరింగ్ విధానంలో వాడుకున్న విద్యుత్ 300 యూనిట్ల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్ 200 యూనిట్లు ముందుగానే తీసేవేస్తే మిగిలిన వంద యూనిట్లకు స్లాబ్ ప్రకారం రూ.5 వసూలు చేయాలి. దీని కోసమే నెట్ బిల్లింగ్ విధానాన్ని టీజీఎస్పీడీసీఎల్ అమలు చేస్తుందని వినయోగదారులు ఆరోపిస్తున్నారు.
గతంలో నెట్ మీటరింగ్
విధానం అమలు
దానిని ప్రసుత్తం నెట్ బిల్లింగ్
విధానంలోకి మార్చిన టీజీఎస్పీడీసీఎల్
ఇంపోర్ట్కు ఎక్కువ ఛార్జీ వసూలు
ఎక్స్పోర్ట్కు తక్కువ ధర చెల్లింపు
అధికారులు ఏమంటున్నారంటే..
సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు గృహజ్యోతి పథకాన్ని వినయోగించుకోవడం వల్ల సంస్థకు భారీ నష్టం జరుగుతుంది. దీంతో సంస్థ ఉన్నతాధికారులు బిల్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లోనే మార్చారు. దీనిలో మా ప్రమేయం ఏమిలేదని స్థానిక విద్యుత్ అధికారులు అంటున్నారు.


