ఒక్క రోజే 40 వేలకుపైగా..
హైవేపై సాఫీగా వాహనాల రాకపోకలు
చిట్యాల, నకిరేకల్, కేతేపల్లి : సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు ఆదివారం వాహనాల రద్దీ కొనసాగింది. పండగకు స్వస్థలాలకు వెళ్లేవారి వాహనాలతో 65వ నంబరు జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. సాధారణ రోజుల్లో 18 నుంచి 20 వేల వాహనాలు కొర్లపహాడ్ టోల్ప్లాజా నుంచి రాకపోకలు సాగిస్తుండగా ఆదివారం ఒక్కరోజే దాదాపు 40 వేల వాహనాలు వెళ్లినట్లు టోల్ అధికారులు పేర్కొన్నారు. అయితే.. హైవేపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించాయి. కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద ట్రాఫిక్కు అంతరాయం కాకుండా చర్యలు తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ట్రాఫిక్ పోలీసులను రప్పించి వాహనదారులకు సూచనలు చేస్తూ టోల్ప్లాజా వద్ద వాహనాలు నిలవకుండా చూశారు. హైవేపై ట్రాఫిక్జాం ఏర్పడుతుండడంతో పలువురు ప్రయాణికులు తమ కుటుంబసభ్యులతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు చిట్యాల మీదుగా ఆదివారం బైక్లపై ప్రయాణించారు.
ప్రజలు రోడ్డు దాటేలా..
చిట్యాలలోని బస్స్టేషన్, పాల కేంద్రం, రైల్వేస్టేషన్ రోడ్డు ఎదురుగా ప్రజలు రోడ్డును దాటేందుకుగాను తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతాల్లో పోలీసులతో పాటు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి రోడ్డు దాటేందుకుగాను ప్రజలకు సహకరించారు. ప్రమాదాలు జరిగితే వెంటనే తగిన ప్రథమ చికిత్స అందించేందుకుగాను చిట్యాలలోని పాలకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పికెట్లో ప్రత్యేకంగా ప్రభుత్వ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. పట్టణంలోని కాలనీల నుంచి హైవే సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలు, ద్విచక్ర వాహనాలు నేరుగా హైవే మీదకు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కాగా.. మండలంలోని పెద్దకాపర్తి శివారులో ఆదివారం మధ్యాహ్నం హైవే రోడ్డు మధ్యలో కొన్ని చెట్లకు ప్రమాదవశాత్తు నిప్పుంటుకుంది. గుర్తించిన పోలీసులు వెంటనే మంటలను ఆర్పివేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిన సిగరెట్ పీకను పడేయటంతో మంటలు లేచినట్లు తెలుస్తోంది.
రెండు రెట్లు పెరిగిన వాహనాలు
సాధారణ రోజుల్లో వచ్చే వాహనాల కంటే ఆదివారం రెండురెట్ల వాహనాలు రావటంతో కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులుదీరాయి. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద ఉన్న 12 కౌంటర్లకు గాను 7 కౌంటర్లను విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు కేటాయించారు. విజయవాడ వైపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాహనాల రద్దీ తగ్గుముఖం పట్టగా సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్ వైపునకు వాహనాల రద్దీ పెరిగింది. వాహనాల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం టోల్ నిర్వాహకులు, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. టోల్ అధికారులు, ఇతర సిబ్బంది, కేతేపల్లి ఎస్ఐ యు.సతీష్ టోల్ప్లాజా వద్దనే మకాం వేశారు.
ట్రాఫిక్ను పరిశీలించిన ఏఎస్పీ రమేష్
జాతీయ రహదారిపై ట్రాపిక్ అంతరాయం జరగకుండా తగిన ముందస్తు చర్యలను తీసుకున్నట్లు ఏఎస్పీ రమేష్ తెలిపారు. చిట్యాల మండలంలోని చిట్యాల, పెద్దకాపర్తి గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డ్రోన్ కెమెరాల ద్వారా హైవేపై ట్రాఫిక్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణతో పాటు వాహనాలు వేగంగా వెళ్లేందుకుగాను పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. ఆయన వెంట డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్ ఉన్నారు.
ఫ ట్రాఫిక్ నియంత్రించిన పోలీసులు
ఫ వాహనదారులకు ఇబ్బంది
కలగకుండా పర్యవేక్షణ
ఫ ద్విచక్ర వాహనాలపై ఎక్కువ
సంఖ్యలో వెళ్లిన ప్రజలు
ఫ కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద
వాహనాల బారులు
ఒక్క రోజే 40 వేలకుపైగా..


