రైతు భరోసా రాదాయే..
యాసంగి సీజన్ రైతు భరోసా సకాలంలో ఇవ్వకపోవడంతో పెట్టుబడుల కోసం అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీపై అప్పు చేయాల్సి వచ్చింది. వెంటనే భరోసా సాయాన్ని అందించాలి.
– పనస కాశయ్యగౌడ్, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం
నల్లగొండ అగ్రికల్చర్ : రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గత యాసంగి సీజన్లో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జనవరి 26న రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాసంగి సీజన్ గత నవంబర్లో ప్రారంభమైంది. ఈ నెలాఖరు వరకు సీజన్ ముగియనుంది. కానీ ఇప్పటి వరకు యాసంగి సీజన్ రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.
6,57,229 ఎకరాల్లో సాగు
యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 6,57,229 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా చేసింది. అందులో వరి 5,64,678 ఎకరాల్లో సాగువుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా వరినాట్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేయలేదు.
పెట్టుబడుల కోసం అప్పులు
యాసంగి సీజన్లో రైతు భరోసా అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకర్లు కూడా పంట రుణాలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రైతులు అధిక వడ్డీపై అప్పులను తీసుకొచ్చి యాసంగి పంటలు సాగు చేస్తున్నారు.
5,65,803 మంది రైతులు
జిల్లా వ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులున్నారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.738 కోట్ల 67 లక్షల 60 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఎ లాంటి ప్రకటనా చేయకపోవడంతో రైతులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతుల భరోసాను వెంటనే జమ చేయాలని కోరుతున్నారు.
ఫ యాసంగి సీజన్ ముగుస్తున్నా అందని సాయం
ఫ పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు
రైతు భరోసా రాదాయే..


