రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం
నల్లగొండ : రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఏ.సురేంద్రమోహన్ అన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి వ్యవసాయ, హార్టికల్చర్, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలను అందించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనన్నారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ప్రభుత్వ స్థలం ఉంటే ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో యాసంగి పంటలకు యూరియా కొరత లేదని, ఫర్టిలైజర్ యాప్ ద్వారా అందరికీ అందుతుందన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, డీసీఓ పత్య నాయక్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, హార్టికల్చర్ అధికారి సుభాషిని తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకతకోసమే యూరియా బుకింగ్ యాప్
నకిరేకల్ : రైతులకు యూరియా సరఫరాలో పారదర్శకత కోసమే యూరియా బుకింగ్ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ చెప్పారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని ఓ ఎరువుల దుకాణంలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. పట్టాకాని రైతులు కూడా యూరియా పొందవచ్చన్నారు. రెండు దఫాలుగా ఇచ్చే విధంగా చూడాలని పలువురు రైతులు కమిషనర్ దృష్టికి తెచ్చారు.
ఫ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్
సురేంద్రమోహన్


