
బీసీ లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ: అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ శిక్షణకు బీసీ లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలని, గుర్తింపు పొందిన యూ నివర్సిటీ నుంచి లా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. ఆగస్టు 15లోగా దరఖాస్తులను జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలని, పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్
మర్రిగూడ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్పై సస్సెన్షన్ శివ స్వరూపారాణిపై వేటు పడింది. ప్రిన్సిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నారని.. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్కు ఫిర్యాదులు అందడంతో గత నెల 28న పాఠశాలలో డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ విచారణ చేపట్టి నివేదికను డైరెక్టర్కు అందచేశారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ఎస్.శివస్వరూపరాణిని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆర్టీసీ సిబ్బందికి
ప్రగతి చక్ర అవార్డులు
రామగిరి (నల్లగొండ) : విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆర్టీసీ సిబ్బందికి రీజియన్ స్థాయిలో ఏప్రిల్, మే, జూన్ నెలల ప్రగతిచక్ర అవార్డులను ఆర్ఎం జానిరెడ్డి శుక్రవారం నల్లగొండలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహిస్తేనే ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందన్నారు. రీజియన్ పరిధిలో 28 మంది సిబ్బందికి ప్రగతిచక్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం, అన్ని డిపోల మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుదారుల జాబితా విడుదల
నల్లగొండ: మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేసే.. మోటరైజ్డ్ వాహనాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారి జాబితాను కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే.. ఈ నెల7 న సాయంత్రం 5 గంటల్లోగా కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించాలి
కనగల్ : విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శుక్రవారం కనగల్ కాంప్లెక్స్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంప్లెక్స్ సమావేశాల్లో ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొనాలన్నారు. అనంతరం పాఠశాలలో, కేజీబీవీలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ వి.పద్మ, కాంప్లెక్స్ హెచ్ఎం డి.విద్యాభార్గవి, కేజీబీవీ ఎస్ఓ స్వప్న పాల్గొన్నారు.
డ్రగ్స్, గంజాయి మహమ్మారిని తరిమికొట్టండి
మిర్యాలగూడ అర్బన్ : డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్లను నిర్మూలించాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవినాయక్, మల్లం మహేష్ కోరారు. జిల్లావ్యాప్త చైతన్య సైకిల్ యాత్రలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సైకిల్ యాత్రలో వారు మాట్లాడారు. మత్తుకు బానిసలుగా మారుతున్న యువత అగాయిత్యాలకు పాల్పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటోందన్నారు. ఆన్లైన్ యాప్ల వల్ల లక్షల రూపాయలు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సైకిల్ యాత్ర సభ్యులు పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, వడ్డగాని మహేష్, సుధాకర్, శశిధర్, రాజేష్, సాయితేజ పాల్గొన్నారు.

బీసీ లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం