వరి నాట్లలో మెళకువలు | - | Sakshi
Sakshi News home page

వరి నాట్లలో మెళకువలు

Jul 25 2025 4:56 AM | Updated on Jul 25 2025 4:56 AM

వరి న

వరి నాట్లలో మెళకువలు

త్రిపురారం: వానాకాలం సీజన్‌ ఇప్పటికే ప్రారంభంకావడంతో నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు ముమ్మరంగా వరి నాట్లు వేసుకుంటున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు సైతం పైనుంచి వరద వస్తుండడంతో మరికొన్ని రోజుల్లో సాగర్‌ కాలువకు నీటి విడుదల కూడా చేసే అవకాశం ఉండడంతో ఆయకట్టు పరిధిలో ఇప్పటికే రైతులు నారు పెంపకం చేపట్టారు. వరి నాట్లలో సరైన మెళకువలు, ఎరువుల యాజమాన్యం పాటించాలని కంపాసాగర్‌ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) సేద్యపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ చంద్రశేఖర్‌ సూచిస్తున్నారు.

సకాలంలో దుక్కులు, దమ్ము చేసుకోవాలి..

రైతులు ప్రధాన పొలాన్ని సకాలంలో మెత్తగా దుక్కి దున్నుకోవాలి. నీళ్లు పెట్టి దమ్ము కూడా చేసుకోవచ్చు. దీంతో పిచ్చి, కలుపు మొక్కలు పొలంలో కలిసిపోతాయి. తర్వాత పొలంలోని గట్లను సమానంగా సరి చేసుకోవాలి. పచ్చిరొట్ట పైర్లు ముందుగానే సాగు చేసుకున్న రైతులు నాట్లకు 15 రోజుల ముందే దమ్ము చేసుకొని భూమిని చదును చేసుకోవాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి రెండు రోజుల ముందే నీళ్లలో దమ్ము చేసి ఆ తర్వాత నాట్లు వేస్తే మంచిది.

ఎరువుల యాజమాన్యం..

ఫ నత్రజని మూడు సమభాగాలుగా వేసి నాటుకు ముందు దమ్ములో, అంకురం దశలో, బురద పదునులో సమానంగా చల్లుకోవాలి. ఎరువులు చల్లిన 30 గంటల తర్వాత పొలానికి నీరు పెట్టడం ఉత్తమం.

ఫ నత్రజనిని కాంప్లెక్స్‌ ఎరువుల రూపంలో గాని యూరియా రూపంలో లేదా నానో యూరియా రూపంలో అందించవచ్చు. శాస్త్రవేత్తల సూచనల మేరకు యూరియాను తక్కువగా వినియోగించుకోవాలి.

ఫ 40 కిలోల యూరియా 10 కిలోల వేప పిండి, లేదా 250 కిలోల తేమ కలిగిన మట్టిని కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది.

ఫ మట్టి పరీక్షల ఆధారంగా మొత్తం భాస్వరం ఎరువులను దమ్ములోనే వేసుకోవాలి.

ఫ పొటాష్‌ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేసుకోవాలి. చెల్క నేలల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగభాగాన్ని వేసుకోవాలి.

ఫ కాంప్లెక్స్‌ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలో గాని అంకురం ఏర్పడే దశలో గాని వేయకూడదు. పూర్తిగా దమ్ములో వేసుకోవాలి.

ఫ ముదరు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫారసు కంటే 25 శాతం పెంచి 70 శాతం దమ్ములో, మిగతా 30 శాతం అంకురం దశలో వేయాలి.

కాలి బాటలు సకాలంలో తీసుకోవాలి.

నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా ఉంటేనే నాటు త్వరగా కుదురుకుంటుంది. నాలుగు నుంచి ఆరు ఆకులు ఉన్న నారును ఉపయోగించాలి. దీర్ఘ, మధ్యకాలిక నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో చదరపు మీటరుకు 40 కదుళ్లు ఉండేవిధంగా చూసుకోవాలి. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు 20సె.మీ. కాలి బాటలు తీసుకోవాలి. కాలి బాటల వల్ల వరి పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేసుకోవచ్చు. కలుపు మందులు, ఎరువులు, పురుగు మందులు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. పైరు పరిస్థితిని తెలుసుకుంటానికి కాలి బాటలు తోడ్పడతాయి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ల సంఖ్యను నిర్ధారించుకోవాలి. భూసారం ఎక్కువగా ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్లు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్లు ఉండేవిధంగా చూసుకోవాలి. ముదురు నారును నాటినప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి 4 నుంచి 5 మొక్కల చొప్పున నాటుకోవాలి.

ఇవి చేయకూడదు.

భాస్వరం ఎరువులతో కలిపి జింక్‌ సల్ఫేట్‌ను వేయకూడదు. కనీసం మూడు రోజుల వ్యవధి ఉండాలి. భాస్వరంలో జింకును కలిపి వేయడం వల్ల రసాయనిక చర్య జరిగి పంటకు ఫలితం ఉండదు. జింక్‌ సల్ఫేట్‌ ద్రావణంలో సైతం పురుగు, తెగుళ్ల మందులు కలపరాదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలతో ఎరువులు, చీడపీడల నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమం.

ఫ కంపాసాగర్‌ కేవీకే సేద్యపు విభాగం

శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ సూచనలు

వరి నాట్లలో మెళకువలు1
1/1

వరి నాట్లలో మెళకువలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement