అనుమానాస్పదంగా మహిళల సంచారం | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా మహిళల సంచారం

Jun 21 2025 3:41 AM | Updated on Jun 21 2025 3:41 AM

అనుమానాస్పదంగా మహిళల సంచారం

అనుమానాస్పదంగా మహిళల సంచారం

మోత్కూరు : అనుమానాస్పదంగా సంచరిస్తున్న మహిళలను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని ముశిపట్ల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గురువారం గ్రామంలో దొంగతనానికి రెక్కి నిర్వహిస్తున్న నలుగురు మహిళలను గ్రామస్తులు గుర్తించి పట్టుకొని ఆరా తీశారు. మధ్యాహ్న సమయంలో గ్రామంలో సంచరిస్తుండగా అనుమానం వచ్చిన పలువురు గ్రామస్తులు వారిని ప్రశ్నించి నిలదీశారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం బలపడింది. ఈ క్రమంలో వారు తప్పించుకునే ప్రయత్నం చేయగా గ్రామపంచాయతీ వద్దకు తీసుకెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నలుగురు మహిళలను విచారించారు. వరంగల్‌ జిల్లాకు చెందిన వాసులుగా గుర్తించారు. వరంగల్‌లోని రెడ్డినగర్‌, హన్మకొండ, కాజిపేట, మడికొండలకు చెందిన తుర్పతి మైసమ్మ, స్వాతి, శారద, సునీతగా పోలీసులు గుర్తించారు. వారిపై ఇప్పటికే నాలుగు దొంగతనం కేసులు నమోదైనట్లు ప్రొబెషనరీ ఎస్‌ఐ నోయల్‌ రాజు తెలిపారు. వారిని తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసి సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులకు అప్పగించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

పుస్తెలతాడు చోరీ

నార్కట్‌పల్లి : మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఈ సంఘటన నార్కట్‌పల్లి మండలం మాధవ ఎడవల్లి సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోతనేనిపల్లికి కమ్మంపల్లి స్వామి, అతడి భార్య అండాలు టీవీఎస్‌ ఎక్సెల్‌పై నార్కట్‌పల్లికి వస్తుండగా వెనక నుంచి బైక్‌పై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అండాలు మెడలోని పుస్తెలతాడును లాక్కెళ్లాడు. పుస్తెలతాడు రోల్డ్‌గోల్డ్‌ అయినా, దానికి పావుతులం బంగారం పుస్తె, పావుతులం బంగారు గుండ్లు ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. స్వామి పోలీసులకు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ రైతు మృతి

మోత్కూరు : పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని దాచారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు అండెం కరుణాకర్‌రెడ్డి గురువారం తన పొలంలో పనులు చేస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతడిని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య బాలమణి, ఓ కుమార్తె ఉన్నారు. శుక్రవారం గ్రామంలో జరిగిన అంత్యక్రియలో కుమార్తె శృతి తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టింది.

పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement