
12 నుంచి ‘ఇగ్నో’ పరీక్షలు
రామగిరి(నల్లగొండ) : జూన్ 12వ తేదీ నుంచి ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని కాకతీయ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ్మారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంటల వరకు నల్లగొండలోని కాకతీయ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రానికి అర గంట ముందే అభ్యర్థులు రావాలని సూచించారు.
‘భగీరథ’ పనుల పరిశీలన
అడవిదేవులపల్లి : అడవిదేవులపల్లి మండలంలో ఉపాధి హామ పథకం చేపట్టిన ‘జల సంచాయి–జల భగీరథ’ పనులను బుధవారం కేంద్ర బృందం పరిశీలించింది. దాంతోపాటు కేంద్ర బృందం సభ్యులు అడవిదేవులపల్లి, ఉల్సాయిపాలెం, కొత్తనందికొండ, మొల్కచర్ల, బాల్నేపల్లి, చిట్యాల తదితర గ్రామాల్లో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను 18 ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీడబ్ల్యూసీ ఇంజనీర్ సంతోష్ ఆధ్వర్యంలో ఈ పరిశీలన సాగింది. కేంద్ర బృందం వెంట క్లస్టర్ ఏపీడీ బాలకృష్ణ, ఎంపీడీఓ మాతంగి రమేష్, ఎంపీఓ సూరానాయక్, టెక్నికల్ అసిస్టెంట్లు చారి, రాధ, వినోద్ తదితరులు ఉన్నారు.
రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం
తిప్పర్తి : రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం తిప్పర్తి మండలంలోని సర్వారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన రైతుల సమస్యలు అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 566 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 3వ తేదీ నుంచి సదస్సులు నిర్వహిస్తున్నామని.. ఇప్పటి వరకు 15వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తిప్పర్తి మండలంలో రెవెన్యూ సదస్సులు ముగిశాయని.. మండల వ్యాప్తంగా మొత్తం 939 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
సైబర్ నేరగాళ్లపైఅప్రమత్తత అవసరం
మర్రిగూడ : ప్రజలకు సైబర్ నేరగాళ్లపై అపమ్రత్తంగా ఉండాలని దేవరకొండ ఏఎస్పీ మౌనిక అన్నారు. బుధవారం మర్రిగూడ పోలీస్స్టేషన్ను ఆమె సందర్శించి రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరువర్గాలను పిలిపించి భూములకు సంబంధించిన సమస్యలను రెవెన్యూ కార్యాలయంలో పరిష్కరించుకోవాలని సూచించారు. దారి సమస్యలు ఉంటే సర్వేయర్ ద్వారా హద్దురాళ్లు పెట్టుకుని తగాదాలకు తావు లేకుండా ఉండాలన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు 1930 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో నాంపల్లి సీఐ డి.రాజు, ఎస్ఐ ఎం.కృష్ణారెడ్డి, సిబ్బంది సైదులు, వాహిద్, సత్యనారాయణ, శిరీష, గీత, రత్నం, కోటేష్, హుస్సేన్ ఉన్నారు.
ఆయిల్పామ్ గెలల సేకరణ కేంద్రం ప్రారంభం
కనగల్ : కనగల్ మండల కేంద్రంలో ఆయిల్పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనగల్ మండలంలో రైతులు 350 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగును చేస్తున్నారని తెలిపారు. 2021 – 22 సంవత్సరం నుంచి ఎన్ఎంఈఓపీ కింద 80 శాతం రాయితీపై ఆయిల్పామ్ మొక్కలు అందిస్తున్నామన్నారు. నాలుగు సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చుల కింద ఎకరాకు రూ.4,200 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తామని.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పతాంజలి ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ శివాజీ పాల్గొన్నారు.

12 నుంచి ‘ఇగ్నో’ పరీక్షలు

12 నుంచి ‘ఇగ్నో’ పరీక్షలు