
మరోసారి ‘ఇందిరమ్మ’ సర్వే
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం రెండో విడత సర్వే ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల మొదటి విడత సర్వే పూర్తి చేసిన అధికారులు (ఎల్–1, ఎల్–2, ఎల్–3) కేటగిరీలుగా విభజించారు. ఎల్–1 కేటగిరీ వారికి మొదట ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఎల్–1 కేటగిరీలో ఎక్కువ మంది ఉండడంతో వారిలో నిజమైన అర్హులను గుర్తించేందుకు రెండో విడత సర్వే చేపడుతున్నారు. మండల స్థాయి గెజిటెడ్ అధికారులతో ఈ సర్వే సాగనుంది. ఆయా అధికారులంతా తయారు చేసిన తుది జాబితాను కలెక్టర్కు పంపుతారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అనుమతితో మే మొదటి వారంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు.
ఎన్నికల హామీ అమలులో భాగంగా..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలతో ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటిచింది. ఇంటి స్థలం లేని వారికి రెండో విడతలో స్థలంతో పాటు ఇంటిని మంజూరు చేస్తామని తెలిపింది. ప్రతి నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. హామీ మేరకు ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులను స్వీకరించి మొదటి విడత సర్వే పూర్తి చేసింది.
పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న
గ్రామాల్లో పనులు ప్రారంభం
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో భాగంగా మొదట పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి జనవరి 26న ఎల్–1 కేటగిరీ వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాల్లో 1904 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా.. 400 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయించగా.. వాటిలో 200 ఇళ్లను ఆయా మండలాల్లోని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాలకు కేటాయించారు. ఇప్పుడు మిగిలిన 3300 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రెండవ విడత సర్వే చేపడుతున్నారు.
కేటగిరీలు ఇలా..
ఫ ఎల్–1 పక్కా ఇల్లు లేకపోవడం. ఇంటి స్థలం ఉండి రేకులు, పెంకుటిల్లు, గుడిసెలో ఉన్నవారు. వీరికి మొదట ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఫ ఎల్–2 ఇల్లు, ఇంటి స్థలం రెండూ లేకపోవడం. అద్దె ఇంట్లో నివాసం ఉండడం. వీరికి ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేయనున్నారు.
ఫ ఎల్3–లో ఆర్సీసీ స్లాబ్ ఇల్లు ఉండి. ఏడెకరాలు కుష్కి, మూడున్నర ఎకరాల తరి భూమి, కారు ఉన్న వారు.
నిధుల మంజూరు ఇలా..
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి మొదటి విడతగా పంచాయతీ కార్యదర్శులు ముగ్గు పోస్తారు. ఆ తర్వాత హౌజింగ్ ఏఈ సిఫారసు మేరకు బేస్మెంట్ కట్టిన తర్వాత రూ.లక్ష మంజూరు చేస్తారు. ఆ తర్వాత గోడలు రూప్ లెవెల్లో పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష, స్లాబ్ వేసే సమయంలో రూ.2 లక్షలు, ఇల్లంతా పూర్తయిన తర్వాత రూ.లక్షను మంజూరు చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం రూ.5 లక్షలను 4 విడతల్లో మంజూరు చేయనున్నారు.
ఫ 22వ తేదీ నుంచి మండల స్థాయి
గెజిటెడ్ అధికారులతో నిర్వహణ
ఫ నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్ల
ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక
ఫ మే మొదటి వారంలో ఇన్చార్జి మంత్రి
అనుమతితో జాబితా ఆమోదం
ఫ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న
గ్రామాలకు 1,904 ఇళ్ల కేటాయింపు