
పంటల రుణ పరిమితి పెంపు
ఒక్కో పంటకు ఎకరాకు గతం కంటే రూ.4 వేలకు పైగానే..
నల్లగొండ అగ్రికల్చర్: రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్ర సహకార బ్యాంకు పంటల రుణ పరిమితిని పెంచింది. పంటల వారీగా సాగుకు అయ్యే ఖర్చులు తదితర వివరాలను అంచనా వేసి అన్నిరకాల పంటలకు 2025–26 వానాకాలం, యాసంగి సీజన్లలో పెంచిన రుణ పరిమితిని అందించనున్నారు. దాదాపు 122 రకాల పంటలతోపాటు ఇతర పెంపకం యూనిట్లకు పెంచిన రుణ పరిమితిని అమలు చేయనున్నారు.
ప్రతి పంటపై పెరుగుదల
గతంలో కంటే ఈ సారి రుణ పరిమితి ప్రతి పంటకు రూ.4వేలకు పైగానే పెరిగింది. ప్రధానంగా వరికి గతంలో ఎకరాకు రూ.42వేలు ఉండగా ప్రస్తుతం రూ.44వేల నుంచి 46 వేలకు పెంచారు. పత్తికి కూడా గతంలో రూ.42వేలు ఉండగా ఇప్పుడు రూ.46 వేల నుంచి రూ.48వేలకు పెరిగింది. దీంతో పాటు పందుల యూనిట్లకు రూ.26 వేల నుంచి రూ.66వేలు, ఒక్కో పాడిగేదెకు రూ.33వేల నుంచి రూ.35వేలు పెంచారు. ఇంకా కోళ్లు, మేకలు, గొర్రెలు, తేనెటీగలు, చేపల పెంకానికి గతం కంటే రూ.4వేలు పెరగగా పూల పెంపకం యూనిట్కు మాత్రం రూ.50వేల నుంచి రూ.62 వరకు ఇవ్వనున్నారు.
ఫ వరికి రూ.46వేలు..పత్తికి రూ.48 వేలు
ఫ అత్యధికంగా అరటికి రూ.లక్ష వరకు..
పంట రుణం (ఎకరానికి రూ.వేలల్లో)
వరి 44- 46
శ్రీవరి 36-38
జొన్న 19-21
సజ్జ 16-18
మొక్కజొన్న 34-36
పత్తి 46-48
కంది 23-25
రాగులు 15-17
మినుము 20-23
పెసర 20-22
వేరుశనగ 30-32
నువ్వులు 20-22
ఆవాలు 14-15
చెరుకు 80-82
ఆయిల్పామ్ 46-48
అరటి 98–లక్ష
నిమ్మ 45-47
మామిడి 45-47
డ్రాగన్ ప్రూట్ 78-80