
రైతులకు మేలు చేసేందుకే ‘భూ భారతి’
కొండమల్లేపల్లి : రైతులకు మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. భూ భారతితో సమీకృత సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందన్నారు. నాలుగు నెలలుగా అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. రైతులకు సంబంధించిన ఏ సమస్య అయిన ఈ చట్టం ద్వారా పరిష్కారం అవుతుందన్నారు. జూన్ 2వ తేది నుంచి భూ భారతి పోర్టల్ పూర్తిగా వినియోగంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు పదిమందిలోపే రావడంతో అధికారులు రైతులకు ముందస్తు సమాచారం చేరవేయలేదనే విమర్శలు వచ్చాయి. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ శ్రీలక్ష్మి, ఎంపీడీఓ బాలరాజురెడ్డి, తహసీల్దార్ అన్వర్హుస్సేన్, ఏఓ జానకిరాములు, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉట్కూరి వేమన్రెడ్డి, సిరాజ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.