
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి
సంస్థాన్ నారాయణపురం: విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని, ఒక లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సర్వేల్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి బుర్రా వెంకటేశం అన్నారు. సర్వేల్ గురుకుల పాఠశాలలో 1983–84లో పదో తరగతి చదివిన ఆయన ఆదివారం పాఠశాలను సందర్శించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించారు. నూతనంగా 5వ తరగతి అడ్మిషన్ పొందిన విద్యార్థితో ముచ్చటించారు. భవిష్యత్లో కలెక్టర్ అవుతానని సదరు విద్యార్థి చెప్పడంతో అభినందించారు. తాను ఈ పాఠశాలలో అడిష్మన్ కోసం తన అమ్మతో కలిసి వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకముందు పాఠశాలలో బీఆర్ అంబేడ్కర్తో పాటు ఇతర మహానీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు అమీర్ ఉల్లాఖాన్, పాల్వాయి రజిని, రామ్మోహన్రావు, గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి రమణకుమార్, డిప్యూటీ కార్యదర్శి ప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్కుమార్ తదితరులున్నారు. అంతకుముందు మల్లారెడ్డిగూడెం గ్రామంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు నర్రి యాదయ్య ఇంట్లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్
బుర్రా వెంకటేశం