
సాగునీటి వనరుల కల్పనలో తుంగతుర్తికి పెద్దపీట
మోత్కూరు: సాగునీటి వనరుల కల్పనలో తుంగతుర్తి నియోజకవర్గానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పెద్దపీట వేశారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో గల జల సౌధ కార్యాలయంలో ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన సాగు, తాగునీరు పెండింగ్ పనులపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గంలోని 9 మండలాల్లో తాగు, సాగు నీటి సమస్యలను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు సంబంధిత ఉన్నత స్థాయి అధికారులకు వివరించారు. రానున్న రోజుల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని బిక్కేరు వాగుపై ఆరు చెక్డ్యాంలు కట్టడం ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించగలిగామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాగు నీటి కొరత లేకుండా చూడటం వల్లనే పంట దిగుబడి బాగా పెరిగిందన్నారు. మరికొన్ని మండలాల్లో కూడా చెక్డ్యాంల నిర్మాణం అవసరమని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అడ్డగూడూరు, శాలిగౌరారం మండలాల్లోని మానాయికుంట చెక్డ్యాం, బునాదిగాని కాల్వ, కేతిరెడ్డి కాల్వ పూర్తిచేస్తే వేలాది ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉందని వివరించారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వ, గంధమల్ల రిజర్వాయర్ ద్వారా మరిన్ని చెరువులు నింపాలని ఆయన కోరారు. చెరువులు, కుంటలు, ట్యాంకులు నింపడంతో సాగు మరింత పెరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలోని సాగు నీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులను కేటాయించాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్అలీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.