
అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలి
నాగార్జునసాగర్ : ప్రపంచ సుందరీమణులు మెచ్చేలా బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని మిర్యాలగూడ సబ్కలెక్టర్ అమిత్ నారాయణ్ అన్నారు. మే12వ తేదీన నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో జరగనున్న బుద్ధపూర్ణిమ కార్యక్రమానికి మిస్వరల్డ్ పోటీలకు హాజరవుతున్న ఆసియాదేశాల సుందరీమణులు హాజరుకానున్న నేపథ్యంలో ఆయన ఇక్కడి ఏర్పాట్ల సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్మితా సబర్వాల్, ఎండీ ప్రకాశ్రెడ్డితో మాట్లాడనని 90శాతం పనులు పూర్తయినట్లు వారికి వివరించినట్లు తెలిపారు. సమయం ఉన్నందున ఏర్పాట్లు ఘనంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్డీ సూధన్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ శ్రీనునాయక్, ఎస్ఐ సంపత్, బుద్ధవనం అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన ధాన్యం తేవాలి
నార్కట్పల్లి : కొనుగోలు కేంద్రాలకు రైతులు అరబెట్టి, తూర్పార బట్టిన నాణ్యమైన ధాన్యాన్ని తేవాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం నార్కట్పల్లి మండలంలోని నెమ్మాని, తొండల్వాయి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. తొండల్వాయిలోని రైస్ మిల్లును సందర్శించి లారీల ద్వారా వచ్చే ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఏఓ గౌతమ్, ఎంపీఓ శ్రీదేవి, ఏఈఓ నవీన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు.
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు
నల్లగొండ : నల్లగొండలోని చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో లష్కర్ పోస్టులు (229), హెల్పర్ (56) పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి ఆసక్తి గల అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ ఎం ప్యానెల్ అయిన ఆసక్తి గల అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు రూ.500 రుసుం చెల్లించి వారి ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో డ్రా తీసి అవుట్సోర్సింగ్ ఏజెన్సీని ఎంపిక చేస్తామని తెలిపారు.
డీటీడీఓగా ముడావత్ చత్రునాయక్
నల్లగొండ : డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అధికారి (డీటీడీఓ)గా ముడావత్ చత్రునాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్నగర్లో పనిచేసిన ఆయన నల్లగొండకు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఇన్చార్జిగా పని చేస్తున్న రాజ్కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.

అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలి

అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలి