
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
నాగర్కర్నూల్: గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో పీఎంశ్రీ పథకంలో ఉత్తమ పాఠశాల ఎన్నిక కాబడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశానికి హెచ్ఎం శ్రీలత అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్కర్నూల్ నియోజకవర్గాన్ని విద్యాహబ్గా మారుస్తానన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో అధ్యాపకుల పాత్ర, కృషి ఎంతో ఉంటుందన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తనకు ఘన స్వాగతం పలికే సందర్భం చూస్తే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని వారిని అభినందించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలని కోరారు. పాఠశాలల బలోపేతంతోపాటు ఉపాధ్యాయుల కొరత తీర్చడంతోపాటు పదోన్నతులు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, డీఈఓ రమేష్బాబు, డీఐఈఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.