
మరో అవకాశం..
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు సాయం కింద పెట్టుబడి కోసం అందించే సాయానికి కొత్త వారికి అవకాశం కల్పించనుంది. కొత్తవారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువు నిర్ణయించింది. ఇప్పటికే 2025 వానాకాలానికి సంబంధించి రైతు భరోసా నిధులు రైతు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొమ్మిది రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా వేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వారికి అవకాశం కల్పిస్తుండడం రైతులకు కొంత ఊరటనిచ్చే అంశమే.
పెరుగుతున్న సాగు విస్తీర్ణం..
జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతోంది. కాగా రైతులకు పెట్టుబడికి సాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతుఖాతాలో ఎకరాకు రూ.6 వేల చొప్పు న జమ చేయనుంది. జిల్లాలో మొత్తం 3,34,835 మంది రైతులు రైతు భరోసాకు అర్హత పొందినవా రు ఉండగా.. కొత్తవారికి అవకాశం ఇస్తుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జూన్ 5 వరకు నూతన పాస్బుక్కులు మంజూరైన రైతులకు కూడా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 20 వరకు సంబంధిత ఏఈఓల వద్ద రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నూతన పాస్బుక్కులు పొందిన రైతులు జిల్లాలో 6,648 మంది ఉండగా అందులో మంగళవారం వరకు దాదాపుగా 4 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. అనంతరం రైతు ఖాతాల్లో భరోసా నిధులు ప్రభుత్వం జమ చేయనుంది.
దరఖాస్తు ఇలా...
కొత్తగా రైతుభరోసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల 20 (శుక్రవారం)లోగా గ్రామంలోని వ్యవసాయ విస్తరణాధికారికి దరఖాస్తు అందజేయాలి. పట్టాదార్ పాసు పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయిన జిరాక్స్, ఆధార్, బ్యాంకు ఖాతా అందజేయాలి. దీంతోపాటు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం ఏఈఓకు అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ నెల 5 వరకు భూ భారతిలో నమోదైన రైతుల వివరాలను రైతుభరోసా పోర్టల్లో పొందుపరిచారు.
రైతుభరోసా కోసం దరఖాస్తుల స్వీకరణ
మరో రెండురోజుల వరకు చివరి గడువు
ఈ నెల 5 నాటికి పాస్బుక్కులు పొందినవారు అర్హులు