
మూడేళ్లుగా నత్తనడకన
అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు గత ప్రభుత్వం ‘మన ఊరు– మన బడి’ పథకం అమలు చేయగా.. కొన్నిచోట్ల పూర్తి కాగా.. మరికొన్నిచోట్ల అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఆయా పనులు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఆ పథకానికి నిధులు రాక ఇక్కట్లు తప్పడం లేదు. ఆయా పనులకు సంబంధించి జిల్లాకు రూ.86 కోట్ల నిధులు మంజూరు కాగా కాంట్రాక్టర్లకు రూ.18.32 కోట్లు విడుదల చేశారు. ఇంకా రూ.11 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 2024– 25 విద్యా సంవత్సరంలో రూ.లక్షలు ఖర్చు చేసి పలు పాఠశాలల్లో మరమ్మతు చేపట్టినా.. మన ఊరు– మనబడి పనులను త్వరగా పూర్తిచేయడానికి అధికారులు చొరవ తీసుకోవడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు సకాలంలో పూర్తి చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనులు ప్రారంభం కాలే..
అచ్చంపేట మండలంలోని రంగాపూర్ ప్రాథమిక పాఠశాల, ఉప్పునుంతల జెడ్పీహెచ్ఎస్, మామిళ్లపల్లి, లక్ష్మాపూర్, వంగూరు మండలం రంగాపూర్ జెడ్పీహచ్ఎస్, బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్, పాలెం, కల్వకుర్తిలోని బాలికల ఉన్నత పాఠశాల, కోడేరు మండలం రాజాపూర్ పీఎస్, తెలకపల్లి మండలంలోని లక్నారం, గౌరెడ్డిపల్లి, కార్వంగ, నాగర్కర్నూల్ జెడ్పీహెచ్ఎస్ బాలుర, బాలికలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొల్లాపూర్ బాలికలు, గాంధీ మెమోరియల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను మనబడి పథకం కింద ఎంపిక చేసినా.. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. అదనపు గదుల కొరత తీవ్రంగా ఉన్నా పట్టించుకొనే వారే కరువయ్యారు.
పర్యవేక్షిస్తున్నాం..
జిల్లాలో మన ఊరు– మన బడి పనులను పర్యవేక్షిస్తున్నాం. కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. పెండింగ్ బిల్లుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఈ విద్యా సంవత్సరం మొదటి, రెండు నెలల్లో పనులు పూర్తి చేయించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.
– నూరుద్దీన్, విద్యా శాఖ సెక్టోరియల్ అధికారి
జిల్లాలో అసంపూర్తిగా ‘మన ఊరు– మనబడి’ పనులు
బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
కొన్నిచోట్ల శిథిల భవనాలను కూల్చివేసి వదిలేసిన వైనం
అదనపు గదులు, భోజనశాలలు,మూత్రశాలల పూర్తిపై నీలినీడలు
అరకొర భవనాల్లో కష్టతరంగా
మారిన విద్యాబోధన