
వంద పాఠశాలల్లో మాత్రమే..
జిల్లాలో మన ఊరు– మనబడి కింద 290 పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు వంద పాఠశాలల్లో మాత్రమే వివిధ రకాల పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. 172 పాఠశాలల్లో నత్తనడకన సాగుతుండగా 18 చోట్ల ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్కర్నూల్ నియోజకవర్గాల్లోని పలు పాఠశాలల్లో ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులు చేపట్టడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నెల 12న పాఠశాలలు తెరిచే వరకు పనులు పూర్తి చేయించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. పాఠశాలల్లో వంట గదుల నిర్మాణం, తాగునీటి వసతి, విద్యుత్, టేబుళ్లు, పాఠశాలలకు రంగులు, గ్రీన్ బోర్డు, తరగతి గదుల మరమ్మతు, అదనపు గదుల నిర్మాణం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీలు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఈ పనులను విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలి.