
ఆకలి బాధ తీరేనా?
నాగర్కర్నూల్: పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసించేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వస్తుంటారు. తమ స్వగ్రామం నుంచి కళాశాల సమయానికి చేరుకునేందుకు ఉదయాన్నే బయలుదేరాల్సి వస్తోంది. అయితే కొందరు విద్యార్థులు భోజనం చేసి రావడం గగనంగా ఉంటోంది. అలాంటి విద్యార్థులు కళాశాలలో ఆకలి బాధతో తరగతులు వినాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసేందుకు గత సంవత్సరం ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరించింది. 2024–25 విద్యా సంవత్సరం చివరలో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో.. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటి నుంచి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈసారి కూడా మధ్నాహ్న భోజనం అమలయ్యే సూచనలు కనిపించడం లేదు.
జూనియర్ కళాశాలల్లో అమలుకు నోచుకోని మధ్యాహ్న భోజన పథకం
గతేడాది ప్రభుత్వానికి ప్రతిపాదనలు
నేటికీ స్పష్టత కరువు
అవస్థలు పడుతున్న గ్రామీణ విద్యార్థులు
ఎలాంటి ఆదేశాలు రాలేదు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాల్సి ఉంది. ఒక్కో విద్యార్థికి ఎంత కేటాయిస్తారు.. ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయాలపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఆదేశాలు వస్తే అమలు చేస్తాం.
– వెంకటరమణ,
ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్

ఆకలి బాధ తీరేనా?