గుప్తనిధులు, లంకె బిందెల పేరుతో నిలువుదోపిడీ
పోలీసులకు ఫిర్యాదు
చేయండి..
ప్రజలు మాయలు, మంత్రాలు, మూఢ విశ్వాసాలను నమ్మకుండా, వాటి పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. గుప్తనిధులు, మంత్రాలు మోసపూరిత మాటలని గ్రహించాలి. మోసగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. నేరుగా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలి.
– రామేశ్వర్, ఏఎస్పీ, నాగర్కర్నూల్
సాక్షి, నాగర్కర్నూల్: ‘మాయలు, మంత్రాల పేరుతో గుప్తనిధులు వెలికితీస్తానని నమ్మిస్తూ ఆస్తులను కాజేయడంతోపాటు అడ్డొచ్చిన వారిని హతమార్చిన ఘటన గతేడాది నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో సంచలనం రేపింది. జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణయాదవ్ గుప్తనిధులను వెలికితీసే పేరుతో అమాయకులను నమ్మించి, ఉన్న ఆస్తులను కాజేస్తూ ఏకంగా 11 మందిని హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గుప్తనిధులను వెలికితీస్తానని, అందుకు వారి పేరిట ఉన్న భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నమ్మించి, తర్వాత అమాయకులను మట్టుబెట్టడంలో ఈ మాయగాడు ఆరితేరాడు. నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుప్తనిధుల మాటున మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి.’
ఉమ్మడి పాలమూరులో ఇంకా మూఢనమ్మకాల జాఢ్యం వీడటం లేదు. మంత్రాలు, మాయలు, గుప్తనిధుల పేరుతో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు ఆశ చూపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మాయగాళ్లను నమ్మి పెద్దఎత్తున సొమ్మును కోల్పోయి మోసపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మూఢనమ్మకాల నిర్మూళనలో పోలీసులు, సంబంధిత అధికారులు చేస్తున్న కార్యక్రమాలతో ఆశించిన ప్రయోజనం ఉండటం లేదు. చాలా సందర్భాల్లో గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన నిందితులు, సూత్రదారులు పోలీసులకు చిక్కడం లేదు.
ఉమ్మడి జిల్లాలో మాయగాళ్లు, నాటు వైద్యులను ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో అమాయకులే లక్ష్యంగా చేసుకుని మాయగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. చిన్నపిల్లలతోపాటు మహిళలు, వృద్ధులు అనారోగ్యానికి గురైనా తాయత్తులు, బిల్లలు కడతామంటూ రోజుకొకరు చొప్పున మాయగాళ్లు పుట్టుకొస్తున్నారు. ప్రధానంగా నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కొందరు వ్యక్తులు మంత్రాలు, నాటువైద్యం పేరుతో వ్యవస్థీకృతంగా దందా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మోసపోయిన బాధితులు కొన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారిపై చర్యలు తీసుకోకుండా మాయగాళ్లకే సహకరించిన ఘటనలే ఎక్కువ.
ఉమ్మడి జిల్లాలోని పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని గుప్తనిధుల తవ్వకాలు చేపడుతూ అపురూపమైన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే నల్లమలలోని పురాతన నవ నారసింహా ఆలయం, ప్రతాప రుద్రుని కోట, రాయలగండి చెన్నకేశవ ఆలయం, బైరాపూర్, వడ్డేమాన్లోని పురాతన ఆలయాల్లో దుండగులు తవ్వకాలు జరిపి విగ్రహాలను ధ్వంసం చేశారు. అమూల్యమైన పురాతన విగ్రహాలు, ఆలయాలను పరిరక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మాయగాళ్లు, నాటువైద్యులు
ఆలయాల విధ్వంసం..
అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు వెనకాడని మాయగాళ్లు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
పెరుగుతున్న దందాలు
అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోతున్న వైనం
పోలీసులకు ఫిర్యాదు
చేసేందుకు సైతం వెనకడుగు
అమాయకులకు వల
అమాయకులకు వల