రైతులకు చేరువగా రైతు నేస్తం | - | Sakshi
Sakshi News home page

రైతులకు చేరువగా రైతు నేస్తం

Jun 16 2025 7:03 AM | Updated on Jun 16 2025 7:03 AM

రైతుల

రైతులకు చేరువగా రైతు నేస్తం

అచ్చంపేట రూరల్‌: కాలానుగుణంగా అన్నదాతలు సైతం ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంభించాల్సి వస్తోంది. గ్రామీణ కర్షకులకు సలహాలు, సూచనలు అందిస్తే అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. సరైన పరిజ్ఞానం లేక వ్యాపారులు సూచించిన సలహాలు పాటిస్తూ నష్టపోతుంటారు. మండల కేంద్రాల్లో ఉండే వ్యవసాయాధికారులను కలిసేందుకు వెళ్లడం కష్టంగా ఉండేది. దీనిని దృష్టిలో పెట్టుకొని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి క్లస్టరుకు ఒక రైతువేదిక నిర్మించింది. వాటిలో ఏఈఓలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతువేదికలను మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రతి మండలంలో రైతులకు అందుబాటులో ఉండేలా ‘రైతునేస్తం’ ద్వారా వీడియో కాన్ఫరెన్సు సైతం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 20 మండలాల రైతు వేదికల్లో మొదటగా 20 వీసీలు అందుబాటులోకి తీసుకురాగా.. ప్రస్తుతం మరో 40 వీసీ కేంద్రాలను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని పలు జిల్లాలో వీసీ కేంద్రాలను ప్రారంభిస్తుండగా.. జిల్లాలోనూ 40 వీసీ కేంద్రాలను ప్రారంభించి.. 60 కేంద్రాల్లోని రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు.

సాగు, పాడిపై సూచనలు

జిల్లాలోని రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఎరువుల యాజమాన్యం, వంగడాల ఎంపిక, కలుపు నివారణ, అధిక వర్షాల వేళ పంటల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలను వివరిస్తున్నారు. చిరుధాన్యాలు, వాణిజ్య పంటలు, కూరగాయల సాగు విధానాలను అడిగి తెలుసుకుని సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. కాలానుగుణంగా పశువులకు అందించాల్సిన టీకాలపై సంబంధిత శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు వచ్చే రాయితీలు, దరఖాస్తు విధానాలను వివరిస్తున్నారు. తాజాగా మరిన్ని రైతు నేస్తం కేంద్రాలను విస్తరించడంతో మరింత మంది రైతులకు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆధునిక పరిజ్ఞానంతో..

వ్యవసాయ రంగంలో ఆధునిక పరిజ్ఞానం రైతులకు మరింత చేరువయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంటల సాగులో మెలకువలు, ఆధునిక పద్ధతులపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంతోపాటు సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చి నుంచి ప్రతి మంగళవారం ‘రైతునేస్తం’ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలోని 20 మండలాల్లో కేటాయించిన రైతు నేస్తం రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సులను వ్యవసాయశాఖ నిర్వహిస్తోంది. రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సుకు సంబంధించిన ఎలక్ట్రికల్‌ పరికరాలు కంప్యూటర్‌, మైకులు, ఇన్వర్టర్‌ బ్యాటరీలతోపాటు నెట్‌ కనెక్షన్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నేరుగా రైతులతో ముఖాముఖి నిర్వహించడంతోపాటు సాగులో మెలకువలు, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, పంటల తెగుళ్ల నివారణ, చీడపీడల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, నూతన వంగడాలపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ రంగంతోపాటు అనుబంధ రంగాలపై కూడా వీసీలో చర్చిస్తున్నారు.

అచ్చంపేట మండలంలోని పులిజాల రైతు వేదిక

రైతులకు ఎంతో మేలు..

రైతువేదికలకు వీడియో కాన్ఫరెన్సులు మంజూరు కావడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. జిల్లాలోని 20 మండలాల్లో ఇప్పటికే 60 రైతునేస్తం కేంద్రాలు మంజూరయ్యాయి. వీటి ద్వారా ఎప్పటికప్పుడు పంటల సాగులో మెలకువలను తెలియజేసే వీలుంటుంది. రైతులు రైతువేదికల వద్దకు వెళ్లి సద్వినియోగం చేసుకోవాలి. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. రైతులు అందరూ పాల్గొనాలి.

– చంద్రశేఖర్‌, జిల్లా వ్యవసాయాధికారి

జిల్లాలో అందుబాటులోకి రానున్న మరో 40 కేంద్రాలు

ఇప్పటికే 20 రైతు వేదికల్లో

అందుతున్న సేవలు

నేడు జిల్లా రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఆధునిక పరిజ్ఞానంతో

అన్నదాతలకు ప్రయోజనం

రైతులకు చేరువగా రైతు నేస్తం1
1/1

రైతులకు చేరువగా రైతు నేస్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement