పాలనలో ముద్ర | - | Sakshi
Sakshi News home page

పాలనలో ముద్ర

Jun 16 2025 7:03 AM | Updated on Jun 16 2025 7:03 AM

పాలనలో ముద్ర

పాలనలో ముద్ర

నాగర్‌కర్నూల్‌: గతేడాది జూన్‌ 16న బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. నిబద్ధత, దార్శనికత, కఠోర శ్రమతో జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజు నుంచే ప్రతి పనిని తనదైన శైలిలో ఉత్తమంగా ఉండేలా ప్రయత్నిస్తున్నారు. నిత్యం సమీక్షలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు, ఇతరత్రా కార్యక్రమాల పరిశీలనతో పారదర్శకత పెంచుతున్నారు. ఊహించని విపత్తులు, అధిక వర్షాల వరదలు, ఎస్‌ఎల్‌బీసీ వంటి విపత్తులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటూనే జిల్లా అభివృద్ధికి నిర్విరామంగా కృషిచేస్తున్నారు.

విద్యే మార్పునకు నాంది

కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ విద్యే మార్పునకు నాంది అని భావించి.. జిల్లాలో విద్యా వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను ఆకస్మిక తనిఖీ చేస్తూ.. పాఠాలు బోధిస్తూ.. విద్యాలయాల్లో వసతులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్స్‌, మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ తదితర పాఠాలు సైతం బోధించి.. లక్ష్యం వైపు స్పష్టత ఇస్తూ భవిష్యత్‌ ప్రణాళికపై సూచనలు చేశారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 23వ స్థానంలో జిల్లా ఈ ఏడాది 13వ స్థానానికి చేరుకోవడంలో కలెక్టర్‌ కృషి ప్రత్యేకమైనది.

● ఇందిర సౌర గిరి జల వికాస పథకం ద్వారా పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జిల్లాలోని అమ్రాబాద్‌ మండలం మాచారంలో సీఎం రేవంత్‌రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభ ఏర్పాట్లను అతి తక్కువ సమయంలోనే విజయవంతంగా పూర్తిచేయడంతో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ వారి ప్రశంసలు అందుకుంటూ ముందుకెళ్తున్నారు.

● మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించడానికి డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర వాటిని గాడిలో పెట్టేలా చొరవ తీసుకున్నారు.

● జిల్లా జనరల్‌ ఆస్పత్రితోపాటు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలను ఆకస్మికంగా సందర్శించి.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచిస్తున్నారు. జనరల్‌ ఆస్పత్రి ఐసీయూలో బెడ్స్‌, డ్రగ్స్‌ అలాగే నిరంతరం శానిటేషన్‌ చేపట్టాలని, ప్రసూతి కోసం వచ్చే గర్భిణులకు సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేశారు. ఎప్పటికప్పుడు జనరల్‌ ఆస్పత్రిలోని సాధారణ, ఆర్థో వార్డులను తనిఖీ చేసి రోగులతో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుంటున్నారు.

● కలెక్టరేట్‌లో అధికారులు సమయపాలన పాటించేలా బయోమెట్రిక్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నిత్యం సమీక్షలు జరుపుతూ ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగిరం చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సత్వరమే పరిష్కరించాలని సూచిస్తున్నారు.

● నల్లమల్ల ప్రాంతంలోని చెంచుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించారు. చెంచుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పీఎం జన్మన్‌ యోజన) పథకం ద్వారా జిల్లాలోని 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలు విడతల వారీగా చేపట్టారు. చెంచు పెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణం ప్రతిపాదించి పనులు ప్రారంభించారు. కొంతమంది చెంచులకు కిసాన్‌ క్రెడిట్‌, ఆయుష్మాన్‌ భారత్‌, ఆధార్‌ కార్డులు అందజేశారు. ప్రత్యేకంగా మెడికల్‌ వాహనం ఏర్పాటు చేశారు. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్‌ ప్రతిపాదనలు పంపించారు.

కలెక్టర్‌గా ఏడాది పూర్తి చేసుకున్న

బదావత్‌ సంతోష్‌

నిత్యం సమీక్షలతో

అధికారులకు దిశానిర్దేశం

పదో తరగతి ఫలితాల పెరుగుదలకు కృషి

విజయవంతంగా అధికారిక కార్యక్రమాల నిర్వహణతో ప్రముఖుల ప్రశంసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement