
సన్నబియ్యం పథకం పేదలకు వరం
వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకం పేదల కడుపు నింపుతుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఆయన పర్యటించారు. గ్రామానికి చెందిన నాగనూలు లక్ష్మమ్మ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రేషన్ షాపులలో సన్నబియ్యం అందిస్తున్నట్లు వివరించారు. పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు. అలాగే గ్రామంలో పెద్ద మొత్తంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండారెడ్డిపల్లి రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయడంతోపాటు అండర్ డ్రెయినేజీ పనులను ప్రారంభించాలన్నారు. పాల శీతలీకరణ భవనాన్ని కూడా త్వరితగతిన పూర్తిచేయాలని, భగీరథ లైన్ ద్వారా తాగునీటి సరఫరా అందించాలని, గ్రామంలో వందశాతం సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కలెక్టర్ ప్రత్యే క పూజలు చేశారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి విజయ్కుమార్, డీపీఓ రాంమోహన్రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.