
విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం : డీజీపీ
గద్వాల క్రైం: కేసుల నమోదు విషయంలో ఏ స్థాయి అధికారి అయినా నిర్లక్ష్యం.. అవినీతి, అక్రమ దందాల వ్యవహారంలో అంటకాగినట్లు బహిర్గతమైతే ఉపేక్షించేది లేదని రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ప్రజలకు, యువతకు దిక్సూచిగా వ్యవహరిస్తూ.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఉండాలని జిల్లా పోలీసు శాఖకు డీజీపీ దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలను వెల్లడించారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో ఆన్లైన్ బెట్టింగ్ కేసులపై ప్రత్యేక బృందం విచారణకు శ్రీకారం చుట్టిందన్నారు. యువత బెట్టింగ్ యాప్ల ద్వారా తమ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్న ఘటనలు ప్రతి చోట వెలుగులోకి వస్తున్నాయని.. ఈ కేసుల విచారణకు సీట్ దర్యాప్తు చేస్తుందన్నారు. నడిగడ్డలో నమోదైన బెట్టింగ్ కేసుల నివేదికలను అందించాలని డీజీపీ ఆదేశించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో నిషేధిత మత్తు పదార్థాలు, ఇసుక, రేషన్ బియ్యం, మట్టి, నకిలీ విత్తనాలు, గంజాయి, గుట్కా తదితర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందన్నారు. కృష్ణా, తుంగభద్ర నదీ తీర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు నిఘా పెంచాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. హిట్ అండ్ రన్ కేసులో సాధ్యమైనంత వేగంగా నిందితులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కల్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి.. రౌడీ షిట్ ఓపెన్ చేయాలన్నారు. మావోయిస్టు, ప్రభుత్వ వ్యతిరేకత అంశాలపై ద్వేషం, హింసాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా ఉంటే గుర్తించాలని సూచించారు.
9న కలెక్టరేట్ ముట్టడి
నాగర్కర్నూల్ రూరల్: రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9న కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నామని సంఘం నాయకుడు వార్ల వెంకటయ్య అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టే కలెక్టరేట్ల ముట్టడికి తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు జిల్లా సంఘం నాయకులు కృష్ణాజీ, అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి సూర్యశంకర్గౌడ్, నాయకులు చంద్రమోళి, రైతు సంఘం నాయకులు కృష్ణయ్య, కొండన్నగౌడ్, నారాయణ, కుర్మయ్య పాల్గొన్నారు.
యాదగిరిగుట్టకు
ప్రత్యేక బస్సు
కొల్లాపూర్: పట్టణం నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డీఎం ఉమాశంకర్ తెలిపారు. ప్రతిరోజూ కొల్లాపూర్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బస్సు కల్వకుర్తి, ఆమనగల్, తుక్కుగూడ మీదుగా బయలుదేరుతుందని, మరుసటి రోజు తెల్లవారుజామున యాదగిరిగుట్ట నుంచి తిరుగు ప్రయాణం ఉంటుందని చెప్పారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం : డీజీపీ