
వెలిశాల.. శోకసంద్రం
టేకుమట్ల: మూడు దశాబ్దాలుగా పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమ బాట పట్టి ఎన్కౌంటర్లో మృతిచెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్ అంత్యక్రియలు స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో శుక్రవారం ముగిశాయి. రంపచోడవరంలో గురువారం రాత్రి పోస్టుమార్టం అనంతరం రవి పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించగా శుక్రవారం ఉదయం 8:30 గంటలకు స్వగ్రామమైన వెలిశాలకు చేరుకుంది. ఉద్యమ గీతాలతో కవులు, కళాకారులు, ఉద్యకారులు ఉద్యమాల బిడ్డా, నిను మరువదు ఈ గడ్డ అంటూ నివాళులర్పించారు. కాగా, రవి మృతదేహాన్ని వెలిశాలకు తీసుకొస్తున్న సమయంలో చిట్యాల, చల్లగరిగలో వాహనాన్ని ఆపి పలువురు నివాళులర్పించారు.
ఎరుపెక్కిన వెలిశాల..
గాజర్ల రవి అలియాస్ గణేష్ అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో పెద్దఎత్తున ఎర్రజెండాలు, రవి చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయన పార్థీవ దేహం వెలిశాలకు చేరుకోగానే ఉద్యమ గీతాలతో హోరెత్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన అంతిమయాత్ర కూతవేటు దూరానికే సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఉద్యమ నినాదాలు, గీతాలు, డప్పు కళాకారుల దరువులకు వెలిశాల దద్ధరిల్లింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప ఉద్యమ గీతాలు, నృత్యాలతో విప్లవానికి చావు లేదనే విధంగా ఆడి పాడారు. అంతిమ యాత్ర ప్రారంభం నుంచి చివరి అంకం వరకు ఉద్యమ గీతాలు, నృత్యాలతో హోరెత్తించారు.
భారీగా తరలివచ్చిన అభిమానులు
గాజర్ల రవికి అంతిమ వీడ్కోలు తెలిపేందుకు మాజీ మావోయిస్టులు, ప్రజాసంఘాల నాయకులు, కవులు, గాయకులు, ప్రజలు, అభిమానులు తరలిరావడంతో వెలిశాల జన సంద్రమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ప్రధాని నరేంద్రమోదీ, అమిత్షా కనుసన్నల్లో పని చేస్తున్నాడని భారత్ భచావో అధ్యక్షుడు, తెలంగాణ సిద్ధాంతకర్త గాదె ఇన్నయ్య, విమలక్క మండిపడ్డారు. హక్కులు సాధించుకోవాలంటే పోరాడాలని అమ్మే నేర్పిందని గాజర్ల రవి సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు అన్నారు. కష్టమున్న చోట ఎదురించి పోరాడమని వెలిశాల చెప్పిందని అన్నారు. దొరలు, పెత్తందార్లు చేసే అరాచకాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం గాజర్ల కుటుంబం పోరాడిందని.. ఆ క్రమంలో పోలీసులు పెట్టిన చిత్రహింసలు వెలిశాల ప్రజలకు తెలుసన్నారు. చివరికి అన్నయ్య రవన్న మృతదేహాన్ని సైతం రంపచోడవరం ఆస్పత్రిలో చూపించకుంటే పోలీసులను ప్రశ్నిస్తేనే చూపించారని అన్నారు.
నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు..
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, తీన్మార్ మల్లన్న గాజర్ల రవి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు వేలాది మంది నడుమ జరిగిన అంతిమయాత్ర అనంతరం గాజర్ల రవి అలియాస్ గణేష్ చితికి సోదరుడు అశోక్ అలియాస్ ఐతు నిప్పంటించారు.
మావోయిస్టు నేత
గాజర్ల రవికి కన్నీటి వీడ్కోలు
ఎర్రజెండాలతో ఎరుపెక్కిన గ్రామం
తరలివచ్చిన ప్రజలు,
ప్రజాసంఘాల నాయకులు
నివాళులర్పించిన ఎమ్మెల్యే,
ఎమ్మెల్సీలు

వెలిశాల.. శోకసంద్రం